క్రీడలకు, రాజకీయాలతో సంబంధమే లేదు. దశాబ్దాలుగా క్రీడలు, రాజకీయాలు వేర్వేరు రంగాలు. ప్రస్తుతం రాజకీయ నేతలు క్రీడలను పావుగా వాడుకుని జనాన్ని రెచ్చగొడుతున్నారు. క్రీడలకు రాజకీయ రంగు పులిమి పబ్బం గడుపుకుంటున్నారు. రాజకీయ చదరంగం సామాన్యులు బలవుతున్నారు. క్రీడలకు అంతరాయం కలుగుతోంది.
పొలిటిషియన్లు క్రీడలను స్వార్థానికి వాడుకుంటున్నారు. పార్టీల మధ్య గొడవలు, రాష్ట్రాల మధ్య వివాదాలు, నేతల విభేదాలు క్రీడలను భ్రష్టు పట్టిస్తున్నాయ్. కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరి జలాల వివాదం నేపథ్యంలో చెన్నైలో జరగాల్సిన మ్యాచ్లు మరో ప్రాంతానికి తరలివెళ్లాయ్. దశాబ్దాలుగా ఈ జల వివాదం రెండు రాష్ట్రాల మధ్య నలుగుతూనే ఉంది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని కావేరి బోర్డును ఏర్పాటు చేయాలని కేంద్రానికి డెడ్లైన్ విధించింది.
తాగునీటి అవసరాలు తీరిన తరువాతే సాగునీటి అవసరాలు చూడాలన్నది ఒక విధానంగా ఉంటోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో బెంగళూరు నీటి ఎద్దడి తీర్చేందుకు కర్ణాటకకు కాస్త ఎక్కువ నీళ్లు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దీనిపై తమిళనాడులో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరి కావేరి నదీజలాలకు, ఐపీఎల్ మ్యాచ్లకు మధ్య సంబంధముందా అంటే ఎలాంటి సంబంధం లేదు. తమిళనాడు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు ఈ విషయంలో ఎందుకు అతిగా స్పందిస్తున్నారంటే ప్రధాన కారణం సెంటిమెంట్. ఆ సెంటిమెంట్తో వచ్చే ఎన్నికల్లో గెలవాలన్నదే వారి లక్ష్యం.
సెంటిమెంట్ ఎంతో బలమైంది సెంటిమెంట్ కోసం తమిళ ప్రజలు ఏమైనా చేస్తారు. ప్రతి అంశానికి సెంటిమెంట్తో ముడిపెట్టడం కూడా తప్పే. క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాలని పలు సందర్భాల్లో పొలిటిషియన్లు చెబుతారు. రాష్ట్రాల మధ్య వివాదాలు, ఇతర గొడవలు వచ్చే సమయానికి క్రీడాస్ఫూర్తిని నేతలెవరు పట్టించుకోరు. చిచ్చును రాజకీయ నేతలు మరింత రాజేస్తారు. సెంటిమెంట్ పేరు చెప్పి ప్రజల జీవితాలతో ఆడుకుంటారు. ఈ సెంటిమెంట్ను రెచ్చగొట్టడంలో మహారాష్ట్రలో శివసేన తక్కువేం కాదు. ముంబైలో భారత్-పాక్ మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐ షెడ్యూల్ ప్రకటిస్తే పిచ్ను తవ్వేస్తామంటూ శివసేన నేతలు వార్నింగ్ ఇచ్చారు. 2016లో బీసీసీఐ వెనక్కి తగ్గి ఐపీఎల్ మ్యాచ్లను మరోచోట నిర్వహించాల్సి వచ్చింది.
అసలు ఐపీఎల్కు, కావేరీ నదీ జలాలకు ఏమైనా సంబంధం ఉందా ? కావేరీ నదీ జలాల వివాదాన్ని విచారిస్తున్న సుప్రీం కోర్టుకు, ఐపీఎల్కు మధ్య ఏమైనా సంబంధం ఉందా ? అంటే అదేమీ లేదు. పోనీ చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లకూ కావేరీ నదికి మధ్య ఏదైనా లింక్ ఉందా ? అదీ లేదు రజనీ కాంత్, కమల్ హాసన్ లాంటి వారికి, క్రికెట్కు మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. పోనీ ఐపీఎల్ మ్యాచ్లను అడ్డుకుంటే కావేరీ వివాదం పరిష్కారం అవుతుందా అంటే అదీ లేదు మరెందుకు తమిళనాడులోని నాయకులు, సినీ ప్రముఖులు ఐపీఎల్ను టార్గెట్గా చేసుకున్నారు ? ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏదో విధంగా ప్రజలను రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకునేందుకే నేతలు క్రీడలను పావుగా వాడుకుంటున్నారు.