కట్నం కోసం ఓ కసాయి భర్త..భార్య నాలుక కోసేసి..

Update: 2018-11-20 08:06 GMT

కట్నం కోసం కట్టుకున్న భార్య నాలుకను కోసేశాడు ఓ ప్రబుద్ధుడు. 10 రోజుల క్రితం జరిగిన ఈ దారుణమైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో కాన్పూర్‌ జిల్లా బర్రా ప్రాంతానికి చెందిన  ఆకాష్ అనే వ్యక్తికి, అతని భార్యకు మధ్య ఈనెల 6న గొడవ జరిగింది. భార్య ఇంటి నుంచి కట్నం కోసం డిమాండ్ చేస్తుండగా, ఆమె అతనితో వాదించింది. వివాదం పెద్దదిగా మారింది. భార్య తనకు ఎదురుసమాధానం చెబుతుండడంతో తట్టుకోలేకపోయిన ఆకాష్ ఆమె నాలుకను కత్తితో కోసేశాడు. విషయం బయటకు వెళ్లకుండా భార్యను 10 రోజులు ఇంట్లోనే నిర్భంధించాడు. ఇంట్లో చిత్ర హింసలు భరించిన ఆమె తన తండ్రికి ఫోన్ చేసి జరిగిన విషయం తెలియజేసింది. దీంతో కూతురు ఇంటికి వెళ్లిన ఆయన వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. చికిత్స నిర్వహించిన వైద్యులు ఆమె నాలుకకు కుట్లు వేశారు. అనంతరం తన తండ్రితో కలిసి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆకాష్ తండ్రి పోలీసు హెడ్ కానిస్టేబుల్ కావడంతో పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని బాధితురాలు ఆరోపించింది. దాంతో నిందితుడిని తక్షణమే అరెస్టు చేయాలని ఎస్‌ఎస్‌పీ ఆదేశాలు జారీ చేశారు.

Similar News