చెన్నైలో ఘోర ప్రమాదం జరిగింది. సబర్బన్ రైల్లో ఫుట్బోర్డుపై ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. మరో 10మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్స్కి షిఫ్ట్ చేశారు. చెన్నైలోని సెయింట్ థామస్ మౌంట్ స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సబర్బన్ రైల్లో విపరీతమైన రద్దీ కారణంగా పలువురు ప్రయాణికులు ఫుట్బోర్డ్పై ప్రయాణిస్తుండగా ఈ దారుణం జరిగింది. ట్రాక్ పక్కనుండే విద్యుత్ స్తంభాలు తగిలి పలువురు ప్రయాణికులు ట్రైన్ నుంచి కిందపడిపోయారు. వేగంగా విద్యుత్ స్తంభాలను ఢీకొట్టడంతో తలలు పగిలాయి. దాంతో నలుగురు అక్కడికక్కడే మరణించగా, పది మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే చైన్ లాగి ట్రైన్ నిలిపివేసిన ప్రయాణికులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఇక వెంటనే రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు మరణించినవారి మృతదేహాలను చెన్నై ప్రభుత్వాస్పత్రికి తరలించారు.