కట్నం తీసుకోవడం చట్టరీత్యా నేరం. కానీ ఓ వెబ్సైట్ కట్నాన్ని ప్రోత్సహిస్తూ... మాట్రిమొనీ ప్రారంభించింది. అదికాస్తా ఆనోట ఈనోట పాకి... కాంగ్రెస్ నేతకు చేరింది. అలాంటి వెబ్సైట్పై భగ్గుమన్న నేతలు... ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై స్పందించిన కేంద్ర మంత్రి మేనకాగాంధీ... వెబ్సైట్ని బ్యాన్ చేయాలని ఐటీశాఖకు సూచించారు.
కట్నం తీసుకోవడం, ఇవ్వడం కూడా చట్టరీత్యా నేరం. కానీ ఒక అబ్బాయికి ఎంత కట్నం ఇవ్వాలన్న విషయాన్ని, ఆ అబ్బాయి చేస్తున్న ఉద్యోగం, సంపాదిస్తున్న జీతాన్ని బట్టి, ఎత్తు, రంగుని బట్టి, కులం, మతం, ప్రాంతాన్ని బట్టి, కుటుంబ నేపధ్యం, తండ్రి ఉద్యోగం, ఆస్తిపాస్తులను బట్టి నిర్ణయిస్తుంటారు. దీన్ని ఆధారంగా తీసుకుని ఓ వెబ్సైట్ చట్టానికి వ్యతిరేకంగా కట్నాన్ని ప్రోత్సహిస్తుంది.
ఇటీవల మార్కెట్లో ఏ వస్తువు రేటు ఎంత ఉందో తెలుసుకోవాలంటే ఇంటర్నెట్ని ఆశ్రయిస్తాం. ఎన్నో కొత్త వెబ్సైట్లు పుట్టుకొచ్చి ఇంట్లో నుంచే అన్ని విషయాలను తెలుసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. అదే తరహాలో వరుడికి పెళ్లికి ఎంత కట్నం ఇవ్వాలో చెప్తుంది ఆ వెబ్సైట్. ఇప్పుడీ విషయం వైరల్ అయ్యింది. ఈ వెబ్సైట్పై అనేక మహిళా సంఘాలు, కొందరు రాజకీయ నాయకులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
డౌరీ వెబ్సైట్పై కాంగ్రెస్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా ప్రధాని మోడీకి ట్విట్టర్ లో ఫిర్యాదు చేశారు. అనైతిక చర్యలపై వెబ్సైట్ నిర్వహించడంపై చర్యలు తీసుకోవాలని మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ, ప్రధానికి తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు. ఈ అంశంపై మినిస్టర్ మేనకా గాంధీ స్పందించారు. డౌరీ వెబ్సైట్ను బ్లాక్ చెయ్యమంటూ ఐటీ మినిస్టర్ను కోరారు, చట్ట వ్యతిరేక చర్యలు పాల్పడుతున్న వెబ్సైట్పై చర్యలు తీసుకోవాలని సూచించారు.