అత్యాచారాల విషయంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన బిల్లును పాస్ చేసింది. 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలకు పాల్పడే వారికి ఇకపై ఉరిశిక్ష విధించనున్నారు. ఈ మేరకు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు గురించి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ మాట్లాడుతూ 12 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసున్న బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారు మనుషులు కారని, వారు దయ్యాలతో సమానం అని వ్యాఖ్యానించారు. వారికి జీవించే హక్కు లేదని అన్నారు. పదే పదే వేధింపులకు పాల్పడే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి కఠినమైన శిక్షలు విధిస్తామని తెలిపారు. గత నెల కోచింగ్ సెంటర్ నుంచి ఇంటి వెళ్తున్న బాలికపై కొందరు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం అవ్వడంతో ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువచ్చింది.