ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. మంత్రగాడి మాయ మాటలతో ఓ జంట తమ కన్న కూతుర్నే పొట్టనబెట్టుకుంది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్, మోరదబాద్లోని చౌదర్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ఆనంద్పాల్ ఆరేళ్ల కూతురు తార పోషకాహార లోపంతో బాధపడుతోంది. దీంతో దంపతులిద్దరు వ్యాధి నయం కోసం మంత్రగాడిని సంప్రదించారు. అయితే తారను చంపి ఇంట్లో పూడ్చి పెట్టాలని అతడు సూచించాడు. అలా చేస్తే తరువాత జన్మించబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుందని తెలిపాడు. దీనిని నమ్మిని ఆ దంపతులు కన్న కూతురు గొంతు నులిమి ఇంట్లో పూడ్చి పెట్టారు. పాప విషయంలో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు విచారణ చేపట్టి ఇంట్లో తవ్వడంతో మృతదేహం బయటపడింది.
‘పాపకు ఎన్నో మందులు వాడాము, అవేవీ పనిచేయలేదు అంతేకాకుండా ఇంకా ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. నా మనవడికి కూడా ఎముకలు వంకర్లు పోయే వ్యాధి వచ్చింద’ని తార బామ్మ వెల్లడించారు. తారకు పోషకాహార లోపంతో పాటు ఎముకలు వంకర్లు తిరిగే వ్యాధి ఉన్నట్లు తెలిసిందని పోలీసులు వెల్లడించారు. చిన్నారిని ఊపిరాడకుండా చేసి చంపేశారని పోస్ట్మార్టం నివేదికలో వెల్లడైందని తెలిపారు. పాప తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు.