ఓ వైపు కూటమి ఏర్పాటు మరోవైపు ప్రచారం షెడ్యూల్ ఇంకోవైపు అభ్యర్థుల ఎంపికతో తెలంగాణ కాంగ్రెస్ బిజీ బిజీగా మారింది. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అభ్యర్థుల ఎంపికపై పూర్తి స్థాయి దృష్టి సారించింది. ఇప్పటికే ఓ దఫా ర్చించిన ఎన్నికల కమిటీ.. వచ్చే రోజుల్లో లిస్టును ఫైనలైజ్ చేయనుంది. ఏఐసీసీ నుంచి వచ్చే స్క్రీనింగ్ కమిటీకి త్వరలోనే అభ్యర్థుల నివేదికను అందజేయనుంది.
తెలంగాణ కాంగ్రెస్లో అభ్యర్థల ఎంపిక కత్తిమీద సాములా మారింది. ఆశావహుల నుంచి తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో భారీగా వచ్చిన ధరఖాస్తులను వడపోస్తున్నారు. కూటమి ఏర్పాటు సందర్బంగా దక్కే స్థానాల్లో అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసేందుకు ఎన్నికల కమిటీ కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే గోల్కొండ రిసార్ట్స్లో మొదటి జాబితాపై తీవ్ర కసరత్తులు చేశారు. ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్న ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి అభ్యర్థుల మొదటి జాబితాను అందజేయనున్నారు.
ఇప్పటికే పీసీసీ, ఏఐసీసీ.. రెండు వేర్వేరు సర్వేలు చేశాయి. అభ్యర్థుల ఎంపికలో ఈ రెండు సర్వేల్లో ఒకే పేరు వచ్చినవారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇక టికెట్ల కేటాయింపులో ముందుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, తర్వాత మాజీ మంత్రులు, సీనియర్ లీడర్లకు అవకాశం కల్పించనున్నారు. ఆ తర్వాత 2009 లో గెల్చినవాళ్లకు కూడా అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. వరసగా మూడు సార్లు ఓడిపోయినవారికి, కనీసం డిపాజిట్ కూడా దక్కనివారికి టికెట్లు నిరాకరించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.
టిడిపి, టిజెఎస్, సిపిఐ పార్టీలతో కలిసి ముందుకెళ్తున్న నేపథ్యంలో పార్టీలో కుటుంబానికి ఒకటే టికెట్ అనే అంశంపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. అలాగే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరిన ముఖ్యనేతలకు కూడా టికెట్లు కేటాయింపు ఉంటుందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్ రెడ్డి, విజయరామారావు, సీతక్క, నాగం జనార్థన్ రెడ్డి, కొండా సురేఖ, రమేష్ రాథోడ్ వంటి వాళ్లకు టికెట్ల కేటాయింపుపై కూడా చర్చలు జరుగుతున్నాయి. స్క్రీనింగ్ కమిటి పర్యటన తర్వాత.. టీ పీసీసీ ఇచ్చిన లిస్ట్ ని స్కౄట్నీ చేసి.. ఫైనలైజ్ చేయనున్నారు. ఇక ఈ లిస్ట్ పై అహ్మద్ పటేల్ ఆధ్వర్యంలోని సీనియర్ నాయకులు.. వార్రూమ్లో భేటీ నిర్వహించి.. తుది జాబితాను రాష్ట్రానికి పంపనున్నారు.