కారు జప్తుపై వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి స్పందించారు. వారంలోగా అద్దె చెల్లించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హన్మకొండలోని కిషన్పురలో ఉంటున్న కృష్ణారెడ్డి అనే వ్యక్తికి చెందిన భవనాన్ని ఐసీడీఎస్ కార్యాలయం కోసం ప్రభుత్వం అద్దెకు తీసుకుంది. అయితే 2014 నాటికి 3,30,958 అద్దె చెల్లించాల్సి ఉండగా.. ఆ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించలేదు.
ఐసీడీఎస్లో పెండింగ్ బిల్లులపై భవన యాజమాని జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఇప్పటి వరకు వడ్డీ సహా రూ.6లక్షలు బకాయి పడగా నయా పైసా కూడా చెల్లించలేదని భవన యజమాని కృష్ణ కోర్టుకు ఫిర్యాదు చేశారు. దీనిపై వాదనలు విన్న వరంగల్ రెండో అదనపు సీనియర్ సివిల్ జడ్జి.. ఆమ్రపాలి వినియోగిస్తున్న ఫార్చునర్ కారును జప్తు చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ క్రమంలో వెంటనే స్పందించిన కలెక్టర్ ఆమ్రపాలి.. వారంలోగా అద్దె చెల్లించాలని, దానికి సంబంధించిన నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.