ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు మలిదశ పోలింగ్ జరుగుతుంది. 72 నియోజకవర్గాల్లో ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. మొత్తం లక్ష మందికిపైగా భద్రతా సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారు. శాసనసభ స్పీకర్, తొమ్మిది మంది మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు బూపేష్ భగేల్ తదితరుల భవితవ్యం నేడు ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. బీజేపీ, కాంగ్రెస్లు 72 నియోజకవర్గాల్లోనూ పోటీచేస్తున్నాయి. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న 18 నియోజకవర్గాల్లో ఈ నెల 12 తొలిదశ పోలింగ్ జరిగింది. వచ్చే నెల 11న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఇవాళ పోలింగ్ జరుగుతున్న 72 నియోజకవర్గాల్లో జనరల్ స్థానాలు 46, ఎస్టీ స్థానాలు 17, ఎస్సీ స్థానాలు 9 ఉన్నాయి. 2013 ఎన్నికల్లో ఈ 72 స్థానాల్లో 43 చోట్ల బీజేపీ అభ్యర్థులు, 27 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. అలాగే ,ఒక స్థానంలో బీఎస్పీ అభ్యర్థి, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.
మరోవైపు ఈ 72 స్థానాల్లో మొత్తం ఐదు డివిజన్లు ఉన్నాయి. అందులో 1. బస్తర్ 2. రాయ్పూర్ 3. దుర్గ్ 4. బిలాస్పూర్ 5. సర్గుజా. వీటిలో బస్తర్లోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు, దర్గ్లోని 6 స్థానాలకు ఈ నెల 12న పోలింగ్ జరిగింది. మలిదశలో రాయ్పూర్లోని 20, దుర్గ్లోని మిగిలిన 14, బిలాస్పూర్ డివిజన్లోని 24, సర్గుజాలోని 14 స్థానాల్లో ఇవాళ పోలింగ్ జరుగుతుంది. ఇవాళ తుది దశ పోలింగ్ జరుగుతున్న స్థానాల్లో ప్రముఖులు బరిలో ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడు భూపేష్ బగేల్, కాంగ్రెస్ నుంచి సీఎం రేసులో ఉన్న చరణ్దాస్ మహంత్, టీఎస్ సింగ్దేవ్. జేసీసీ అధ్యక్షుడు అజిత్జోగి, ఆయన సతీమణి రేణు జోగి, తొమ్మిది మంది మంత్రులు ఉన్నారు.