ఎన్నికల వేళ టీఆర్ఎస్కు ఊహించని షాక్ తగిలింది. చేవేళ్ల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు రాజీనామా లేఖ పంపారు . వారం క్రితమే పార్టీకి రాజీనామా చేస్తారంటూ వార్తలు వినిపించినా స్వయంగా విశ్వేశ్వర రెడ్డే ఖండించడంతో అంతా సద్దుమణిగిందనుకున్నారు. అనూహ్యంగా ఈ రోజు రాజీనామా లేఖను పంపడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. సీఎం కేసీఆర్కు మూడు పేజీల లేఖ రాసిన ఆయన పలు అంశాలను ఇందులో ప్రస్తావించారు. తాజా పరిణామాలపై రేపు మీడియా సమావేశం నిర్వహించనున్నట్టెు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రకటించారు.
ముందుగా సిద్ధం చేసుకున్న రాజీనామా లేఖపై ఈ రోజు తేదిని వేస్తూ సీఎం కేసీఆర్కు లేఖ పంపారు. మూడు పేజీల లేఖలో పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. తనకు పార్టీలో తగిన గౌరవం దక్కడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన విశ్వేశ్వరరెడ్డి బాధతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. లోక్సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానంటూ లేఖలో తెలిపారు.
నిబద్ధతో కూడిన వ్యక్తిగా పార్టీ కోసం శ్రమించానంటూ లేఖలో చెప్పిన విశ్వేశ్వరరెడ్డి తన రాజీనామాకు ఐదు కారణాలను వివరించారు. వ్యక్తిగత సమస్యలు, కార్యకర్తలు, తెలంగాణ వాదులకు న్యాయం చేయలేక పోవడం, నియోజకవర్గంలో అభివృద్ధి ఆశించిన స్ధాయిలో జరగకపోవడం, పార్టీలో తనకు తగిన గౌరవం దక్కకపోవడం, రాష్ట్ర స్ధాయిలో కలుగుతున్న ఇబ్బందుల వల్లే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుత పరిస్దితుల్లో పార్టీలో ఇమడలేనంటూ లేఖలో ఆయన వివరించారు.