కట్నం అడిగాడని కాళ్లూ చేతులూ కట్టేసి....

Update: 2018-10-22 07:12 GMT

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఇందిరానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఒక పెళ్లికొడుకు కట్నం రూపంలో మోటార్ సైకిల్‌తో పాటు బంగారు గొలుసు అడిగాడని ఆడపెళ్లి వారు పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు. అంతటితో ఆగక పెళ్లి కొడుకును కట్టేసి శిరోముండనం చేశారు. వివరాల్లోకి వెళితే...బహ్రెయిచ్ జిల్లాకు చెందిన అబ్దుల్లా కమాల్ కు లక్నోలోని ఖుర్రం నగర్ కు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఈ నేపథ్యంలో బంధుమిత్రులతో కలిసి లక్నోలోని షాదీ మహల్ కు చేరుకున్న అబ్దుల్లా కమాల్.. కట్నం కింద బైక్, బంగారు గొలుసు కావాలని డిమాండ్ చేశాడు. లేదంటే పెళ్లి పీటలు ఎక్కబోనని స్పష్టం చేశాడు. కట్నం ఇవ్వబోమని ముందే చెప్పినా అల్లుడు మరోసారి మొండిపట్టు పట్టడంతో వధువు తరఫు బంధువులు రెచ్చిపోయారు. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు అబ్దుల్లాను ఓ పిల్లర్ కు కట్టేసి చావగొట్టారు. అక్కడితో ఆగకుండా శిరోముండనం చేయించారు. అనంతరం పెళ్లిని రద్దు చేసుకుని, సదరు ప్రబుద్ధుడిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News