ఎన్నికలు సమీపిస్తున్న వేళ అయోధ్య అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రామమందిర నిర్మాణం కోసం వీహెచ్పీ, శివసేన రేపు అయోధ్యలో ధర్మసభను ఏర్పాటు చేశాయి. సుమారు 30 వేల మంది కరసేవకులతో సభను నిర్వహించాలని తలపెట్టాయి. దీంతో అయోధ్యలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు సున్నిత పరిస్థితుల దృష్ట్యా యూపీ ప్రభుత్వం అయోధ్యలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. సభ ఏర్పాటు చేసే ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఇప్పటికే 25 వేల మందికి పైగా కరసేవకులు అయోధ్యకు చేరుకున్నారు. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే కాసేపట్లో అయోధ్యకు చేరుకోనున్నారు. కొద్దిసేపటి క్రితమే ముంబై ఏయిర్పోర్ట్కు చేరుకున్న ఆయన రాక కోసం ఆ పార్టీ నాయకులు అయోధ్యలో ఎదురుచూస్తున్నారు. అయోధ్యలో ఆలయం నిర్మాణం కోసం ఆర్డినెన్స్ తీసుకురావాలంటూ గత కొన్నినెలలుగా శివసేన డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు మరింత రాజుకునేలా చేశాయి. 17 నిముషాల్లోనే బాబ్రీని కూలగొట్టామని ఆర్డినెన్స్ తీసుకురావడానికి ఇంకెంత కాలం పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి ఎన్నికల్లో తాము హామీ ఇచ్చినట్లు సంజయ్ రౌత్ గుర్తు చేశారు.
ఇటు శివసేన ర్యాలీపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. అయోధ్యను ఉద్రిక్తంగా మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపిస్తున్నాయి. శివసేన ర్యాలీ దృష్ట్యా అయోధ్యలో ఆర్మీ దళాలతో రక్షణ కల్పించాలని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. అయితే వచ్చే జనవరిలో అయోధ్య అంశంపై విచారణ కొనసాగిస్తామని సుప్రీంకోర్టు ఇటీవలే స్పష్టం చేసింది.