ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో దారుణం జరిగింది. న్యాయ శాస్త్రం చదువుతున్న విద్యార్థిని కొంతమంది దుండగులు కొట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అలహాబాద్లోని కాలికా రెస్టారెంట్లో గత శనివారం చోటు చేసుకున్న ఈ ఘటన సంబంధించిన సీసీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దిలీప్ అనే లా సెకండియర్ విద్యార్థి తన స్నేహితులతో డిన్నర్ చేయడానికి కాలికా రెస్టారెంట్కు వెళ్లాడు. విజయ్ శంకర్ అనే వ్యక్తికి దిలీప్ కాలు తగిలిందన్న విషయంలో చిన్నగొడవ మెదలైంది. డిన్నర్ అనంతరం మరో సారి వీరి మధ్య గొడవ జరగడంతో రెస్టారెంట్ బయట కొట్టుకున్నారు. ఈ సమయంలో రెస్టారెంట్ వేయిటర్ మున్నా చౌహన్ ఐరన్ రాడ్తో దిలీప్పై దాడి చేశాడు. దీంతో అతను కుప్పుకూలిపోవడంతో వెంటనే బైక్పై ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.
ఈ ఘర్షణ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. పోలీసులు స్పందించి కేసు నమోదు చేశారు. రెస్టారెంట్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. నిందితుడైన విజయ్ శంకర్ సింగ్(రైల్వే ఉద్యోగి)ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే దిలీప్ను దుండగులు కొట్టిన సమయంలో పోలీసులకు తక్షణమే సమాచారం ఇవ్వనందుకు.. రెస్టారెంట్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని దిలీప్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.