ఇటీవలి కాలంలో పెట్రో ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) వినియోగదారులకు కాసింత ఊరట కల్పించాలని భావించింది. గురువారం ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే జన్మదినాన్ని పురస్కరించుకుని.. వాహనదారులకు 4 నుంచి 5 రూపాయల మేర తగ్గింపుపై పెట్రోలు అందించాలని ఆ పార్టీ శ్రేణులు నిర్ణయించాయి. అందులో భాగంగా ఈ రోజు రాష్ట్రంలో ఎంపిక చేసిన పెట్రోలు బంక్ల్లో ద్విచక్ర వాహనదారులకు ఈ సదుపాయం కల్పించింది. మరికొన్ని చోట్ల 9 రూపాయల వరకు కూడా తగ్గింపు ఇస్తున్నారు. దీంతో చాలా మంది వాహనదారులు ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నారు. ఎంపిక చేసిన పెట్రోలు బంక్ల ముందు వందల మీటర్ల మేర వాహనదారులు బారులు తీరారు.