సమాజంలో మనిషి అనేవాడే మాయమైపోతున్నాడు. తోటి మనిషి ప్రాణాలు పోతున్నా పట్టించుకోకుండా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఈ మధ్యే ఓ యువకుడు లైవ్లో ప్రాణాలు తీసుకుంటుంటే చోద్యం చూశారే తప్ప ఎవరూ కనీసం ఆపే ప్రయత్నం చేయలేదు. తర్వాత కొద్ది రోజులకే ఇద్దరు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో పోరాడుతున్నా సెల్ఫీలు తీసుకున్నారే తప్ప.. ఆస్పత్రికి తీసుకెళ్లాలన్న ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తించారు. ఆ ఘటనల్ని మర్చిపోకముందే మరొక దారుణం బయటపడింది. ఈసారి గుర్గావ్లో ఓ వ్యక్తి ఫేస్బుక్ లైవ్లో ప్రాణాలు తీసుకుంటుంటే సినిమా చూసినట్లు చూశారే తప్ప ఎవరూ కనీసం పోలీసులకు కూడా సమాచారం ఇవ్వలేదు.
గురుగ్రామ్లోని పటౌడి గ్రామానికి చెందిన అమిత్ చౌహన్కు సోమవారం సాయంత్రం తన భార్యతో గొడవ జరిగింది. ఆమె 7 గంటల ప్రాంతంలో ఇద్దరు పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్లింది. ఇంట్లో ఒక్కడే ఉన్న అమిత్ ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. దానిని ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమింగ్ చేయడం ప్రారంభించాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నాని, ఈ వీడియోని ఇతరులకు కూడా షేర్ చేయండి అంటూ లైవ్ స్ట్రీమింగ్ చూస్తున్న వారికి తెలిపాడు. తర్వాత గంటకు అతడు సీలింగ్ ఫ్యాన్కు ఊరి వేసుకున్నాడు. దాదాపు 2 వేల మంది ఈ వీడియోను చూసినప్పటికీ ఒక్కరు కూడా పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. ఈ ఘటననపై పోలీసులు మాట్లాడుతూ.. ఈ ఘటనకు సంబంధించి మంగళవారం ఉదయం పది గంటలకు తమకు సమాచారం అందిందని తెలిపారు. తాము అక్కడికి చేరుకునే సరికే కుటుంబ సభ్యులు అతని అంత్యక్రిమలు పూర్తి చేశారని పేర్కొన్నారు. అమిత్ మరణంపై కుటుంబ సభ్యులు తమకు సమాచారం ఇవ్వకపోవడం అనుమానాలకు తావిచ్చేలా ఉందని.. దీనిపై విచారణ చేపట్టామని వెల్లడించారు.