ఏపీ ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంక్ పెద్ద షాక్ ఇచ్చింది. నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతి అభివృద్ధి ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. రాజధాని నిర్మాణానికి రుణం కోసం ప్రభుత్వం దరఖాస్తు చేసుకోగా రుణ సహాయాన్ని నిలిపివేసింది. 300 మిలియన్ డాలర్ల రుణ సాయాన్ని కోరగా దాని నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపింది. ఈ మేరకు బ్యాంక్ వెబ్సైట్లో ఈ విషయాన్ని పొందుపరిచారు. దీంతో అమరావతికి కష్టాలు తప్పేలా లేవు.
ఏపీలో కొత్తగా పాలనా పగ్గాలు చేపట్టిన వైసీపీ సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి 2100 కోట్ల రుణాన్ని ప్రపంచబ్యాంకు నిలిపివేసింది. ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రపంచబ్యాంకు కీలక నిర్ణయం తీసుకోవడం సర్వత్రా ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజా నిర్ణయంతో అమరావతి రాజధాని నిర్మాణం నుంచి ప్రపంచబ్యాంకు తప్పుకున్నట్టయింది. గత ప్రభుత్వ హయాంలో అమరావతి నిర్మాణంపై ఆరోపణలు రాగా, ప్రపంచబ్యాంకు బృందం అమరావతిని సందర్శించి పూర్తిస్థాయిలో సంతృప్తి చెందడమే కాకుండా, ఆర్థికంగా అండదండలు అందించాలని నిర్ణయించింది. ఏపీ రాజధాని నిర్మాణానికి అమరావతి అభివృద్ధి కోసం 7200కోట్ల రుణానికి ప్రతిపాదనలను సీఆర్డీయే పంపింది. దీనిలో భాగంగా తొలివిడతగా 3200కోట్లు, రెండో విడతగా మరో 3200కోట్లు తీసుకునేలా అప్పట్లో ఒప్పందం కుదిరింది. తర్వాత ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు రెండుసార్లు అమరావతికి వచ్చి పరిశీలించి వెళ్లారు. ఇటు తొలివిడత రుణం తీసుకునేందుకు కేంద్రం కూడా అంగీకారం తెలిపింది.
తాజాగా ఏపీ ప్రభుత్వం మారడం, వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రపంచ బ్యాంక్ మరోసారి ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. తాము ఇన్స్పెక్షన్కు వస్తామని కోరింది. అయితే, ఇప్పుడే కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి కొంత సమయం కావాలని ఏపీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్కు తెలిపింది. మరోవైపు ప్రపంచబ్యాంక్ బృందం ఏపీలో పర్యటించేందుకు ఇటు కేంద్రం సముఖంగా లేనట్టుగా ప్రపంచ బ్యాంక్కు సమాచారం వెళ్లింది. దీంతో అకస్మాత్తుగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టుగా ప్రపంచ బ్యాంక్ అఫిషియల్ వెబ్సైట్లో తెలిపింది. ఇప్పుడు ఉన్నట్టుండి రుణ సాయంపై ప్రపంచ బ్యాంక్ వెనక్కి తగ్గడంతో రాజధాని నిర్మాణానికి కష్టాలు తప్పేలా లేవు. జగన్ ప్రభుత్వం వల్లే ఇలా జరిగిందని టీడీపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ రుణాలపైనా కూడా నీలినీడలు కమ్ముకున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.