ఏపీ శాసనసభలో గందరగోళం : ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం
ఏపీ శాసనసభలో సభ్యులు పరస్పర విమర్శలు చేసుకున్నారు. దీంతో, వ్యక్తిగత దూషణలు చేశారంటూ అధికార, విపక్ష సభ్యులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. సభలో నిబంధనలపై ఇరు పక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. దీనిపై స్పీకర్ తమ్మినేని సీతారాం కలగజేసుకొని సభా సంప్రదాయాలను ఎవరైనా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. సభ హుందాగా నడిపేందుకు అందరూ సహకరించాలన్నారు. అయినప్పటికీ సభ్యులు శాంతించక పోవడంతో కాస్తా ఘాటుగానే స్పీకర్ స్పందించారు. ఇలా వ్యవహరిస్తే సభ నడపడం చాలా కష్టమవుతుందని వ్యాఖ్యానించారు.
మరోవైపు ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సభ సంప్రదాయాలు మర్చిపోయారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. స్పీకర్ను కూడా బెదిరించేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. టీడీపీ సభ్యులు ఇష్టారీతిన మాట్లాడటం మంచిపద్ధతి కాదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు. అంతేకాకుండా గతంలో టీడీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలను చదివి వినిపించారు.