లాక్డౌన్తో వలస కూలీల కష్టాలు అంతాఇంతా కాదు. తమ సొంత ఊళ్లకు వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఇలానే బెంగాల్కు చెందిన వలస కూలీలు బెజవాడలో చిక్కుకుని కష్టాలు పడుతున్నారు.
కరోనా, లాక్డౌన్తో వలస కార్మికులు కొందరు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. వలస కార్మికులను తరలించడానికి ప్రత్యేక రైల్లు నడుస్తున్నా కొందరికి అందుబాటులో లేకుండాపోతున్నాయి. అయితే బెంగాల్కు చెందిన వలస కూలీలు కొందరు పని నిమిత్తం వచ్చి విజయవాడలో చిక్కుకున్నారు.
లాక్డౌన్ పొడిగింపుతో ఉండటానికి గూడు లేక తినడానికి తిండి లేక ఉపాధిలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బెంగాల్ వలస కార్మికులు. దీంతో చేసేదేమీలేక తమ స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వలస కూలీలను తరలించడానికి ఏర్పాటు చేసిన శ్రామిక్ రైళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే రైళ్లు అందుబాటులో లేవని రెండు రోజుల తర్వాత పంపిస్తామని పోలీసులు చెప్పినా వినకుండా ఒక్కసారిగా అందరూ రోడ్లపైకి వచ్చారు.
దీంతో పోలీసులు బెంగాల్ వలస కూలీలపై లాఠీ ఝుళిపించారు. పోలీసుల లాఠీఛార్జీని అదునుగా తీసుకుని స్థానికులు కూడా తమపై దాడి చేశారని బెంగాల్ వలస కూలీలు ఆరోపిస్తున్నారు. స్థానికుల దాడిలో ఒకరికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. పోలీసుల లాఠీఛార్జికి నిరసనగా రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు.
స్వస్థలాలకు పంపేందుకు రెండు రోజులు వెయిట్ చేయాల్సిందేనంటున్నారని తెలిపారు. తాము మాత్రం ఉంటున్న రూమ్లను ఖాళీ చేసి వచ్చామని ఇప్పుడు ఉండటానికి ఇళ్లు లేక, తినడానికి తిండిలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
వలస కూలీలను ఏపీ ఆదరిస్తున్నట్లు.. మరే రాష్ట్ర ఆదరించడం లేదన్నారు టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్ కృష్ణబాబు. ఏ రాష్ట్రం వారు అయిన సరే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడి బస్సుల్లో, రైళ్లల్లో పంపిస్తున్నామన్నారు. జూన్ ఒకటో తేదీన బెంగాల్కి ట్రైన్ వేస్తున్నామని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దన్నారు టాస్క్ఫోర్స్ కమిటీ ఛైర్మన్ కృష్ణబాబు. అయితే వలస కూలీలు సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడం మాస్క్లు ధరించకపోవడం గమనార్హం. ఈ విషయంలో ప్రభుత్వం మాత్రం వలస కూలీలను ఆదుకుంటామని చెబుతోంది.