Pawan Kalyan: నేడు జనసేన ఆవిర్భావ దినం..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి నేటికి (మార్చి 14) ఆరు సంవత్సరాలు అవుతుంది. మార్చి 10, 2014న పవన్ కళ్యాణ్ ఎన్నికల సంఘాన్ని కలసి పార్టీ పేరు నమోదు కోసం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి నేటికి (మార్చి 14) ఆరు సంవత్సరాలు అవుతుంది. మార్చి 10, 2014న పవన్ కళ్యాణ్ ఎన్నికల సంఘాన్ని కలసి పార్టీ పేరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోగా, 11 డిసెంబరు 2014 న ఎన్నికల సంఘం దీనిని ఆమోదించింది. ఇక మార్చి 14, 2014న జనసేన పార్టీని స్థాపిస్తున్నట్టుగా అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. హైదరాబాద్ లోని మాదాపూర్ ప్రాంతంలోని హైటెక్ సిటీ సమీపంలో నోవాటెల్ భవనంలో ఆవిర్భావ సభ నిర్వహించి పార్టీ విధి విధానాలను వివరించారు.. 24 అక్టోబరు 2017 న హైదరాబాద్ లో పార్టీ ప్రధాన కార్యాలయాన్ని స్థాపించారు.
ఆ తర్వాత జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటి చేయనప్పటికీ బీజేపీ - టీడీపీకి తన మద్దతును ప్రకటించింది. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు మారిపోవడంతో తెలుగుదేశం పార్టీతో పొత్తు నుంచి పవన్ బయటకు వచ్చారు. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయి రాజకీయాలపైన ఫోకస్ చేసిన పవన్ సీపీఎం, బీఎస్పీతో కలిసి పార్టీని రాష్ట్రంలో విస్తృతం చేశారు. కానీ ఆ ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం ఒక్క ఎమ్మెల్యే సీటును మాత్రమే గెలుచుకుంది. ఇక పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. ప్రస్తుతం బీజేపీతో దగ్గరై స్థానిక సంస్థల్లో కలిసి పోటి చేస్తున్నారు.
పార్టీ స్థాపించి ఆరు సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ఈరోజు భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం వలన ఈ సారి వేడుకల్ని సాదాసీదాగా నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు పవన్ కళ్యాణ్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం అయి సాయంత్రం 4 గంటలకు ధవళేశ్వరంలోని శ్రీరామపాదాల రేవులో గోదావరి నదికి హారతి ఇచ్చి 'మన నుడి - మన నది' కార్యక్రమానికి శ్రీకారం చుడతారు..