ప్రధాని నరేంద్రమోదీ సోదరుడు, ప్రముఖ సామాజికవేత్త ప్రహ్లాద్ మోదీ పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు. ద్వారకా తిరుమలలో జరిగిన రాష్ట్రస్థాయి దేవతిలకుల, గాండ్ల, తెలకుల సంఘ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో దేవతిలకులు, గాండ్ల, తెలకులు 14 లక్షలకు పైగా ఉన్నారని.. వీరంతా బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారని అన్నారు. వీరికి ఆర్థిక, రాజకీయ రంగాల్లో తోడ్పాటు కావాలని అభిప్రాయపడ్డారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని ఈ సామాజిక వర్గీయులంతా ఏకతాటిపై నిలిచి అన్ని రకాలుగా అభివృద్ధి సాధించాలని సూచించారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల కష్టాలు తెలిసిన మనిషని కితాబిచ్చారు. త్వరలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఈ సామాజిక వర్గీయుల సమస్యలను తీసుకెళ్తానని చెప్పారు. కాగా ద్వారకా తిరుమలలోని దేవతిలకుల సత్రంలో ధనుర్మాస వేడుకల్లో పాల్గొని, పూజలు నిర్వహించారు ప్రహ్లాద్ మోదీ. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ నాయకులు ఉన్నారు.