ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రం చూసుకుంటుందనే వార్తలు వచ్చాయి. అయితే, ఇక ముందు కూడా పోలవరం ప్రాజెక్టు బాధ్యతల్ని రాష్ట్రప్రభుత్వమే చూసుకుంటుందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఛైర్మన్ ఆర్.కె. జైన్ చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితులకు చెల్లించాల్సిన నిధుల సమీకరణ తదితర విషయాలపై పీపీఏ విజయవాడలో ఒక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో పీపీఏ ఛైర్మన్ ఆర్.కె. జైన్, పీపీఏ చీఫ్ ఇంజినీర్ ఏకే ప్రధాన్, జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్, అధికారులు, నవయుగ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రాజెక్టు నిర్మాణ పురోగతి, తదుపరి లక్ష్యాలపై ఈ సమావేశంలో చర్చించారు. పనులు జరుగుతున్న తీరును గుత్తేదారు సంస్థ ప్రతినిధులు, అధికారులను ఛైర్మన్ జైన్ అడిగి తెలుసుకున్నారు. ఆర్అండ్ఆర్పై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. పోలవరం పనులు మరింత వేగంగా జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రప్రభుత్వానికి కేంద్రం ఇవ్వాల్సిన నిధులపై కూడా జైన్ క్లారిటీ ఇచ్చారు. ఇంతవరకూ కేంద్రం 2 వేలకోట్ల రూపాయలు మాత్రమే ఇవ్వాల్సి ఉందనీ, రాష్ట్రం చెబుతున్నట్టు 4,800 కోట్లు కాదనీ ఆయన వివరించారు. ఇక, పోలవరం నిర్వాశిత గ్రామాల్లో పీపీఏ అధికారులు ఈరోజు పర్యటించనున్నారు.