విజయవాడలో చేపట్టిన జూడాల ర్యాలీలో ఉద్రిక్తతకు దారి తీసింది. జూనియర్ డాక్టర్పై డీసీపీ చేయి చేసుకున్న ఘటనపై డీజీపీ గౌతమ్ సవాంగ్ సీరియస్ అయ్యారు. ఘటనపై వెంటనే నివేదిక అందించాలని ఆదేశించారు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద జూడాలు ఆందోళన చేపట్టగా, పోలీసులు హుటాహుటిన రంగప్రవేశం చేశారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన డీసీపీ హర్షవర్థన్ ఆందోళనకారులను చూడగానే సహనం కోల్పోయారు. జూనియర్ డాక్టర్ల దగ్గరకు వెళ్లి ఆందోళనను విరమించాలని ఆదేశించారు. కానీ అందుకు జూనియర్ డాక్టర్లు అంగీకరించలేదు. దీంతో పోలీసులకు జూడాలకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా డీసీపీ హర్షవర్థన్ ఓ జూనియర్ డాక్టర్ కాలర్ పట్టుకుని చెంప చెళ్లుమనిపించారు. డీసీపీ దాడిపై ఆగ్రహానికి లోనైన జూనియర్ డాక్టర్లు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఫిర్యాదు చేశారు.