బీజేపీ మన పార్టీయే అంటున్న జేసీ

Update: 2020-01-06 02:17 GMT

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి టీడీపీని వీడి బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఆదివారం ఆయన అనంతపురంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ తో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా 'బీజేపీ మన పార్టీ....అందుకే బీజేపీ అంటే నాకు అభిమానం' అని సత్యకుమార్‌ తో అన్నారు. పైగా సోమవారం అనంతపురం రానున్న కేంద్ర సహాయక హోంశాఖ మంత్రి కిషన్‌రెడ్డిని కూడా కలుస్తానని ఆయనకు చెప్పారు. దాంతో జేసీ పార్టీ మారుతారన్న ప్రచారం ఊపందుకుంది. ఇదిలావుంటే కొంతకాలంగా టీడీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న జేసీ.. ఇటీవల అధినేత చంద్రబాబు ముందే ఆయనపై విమర్శలు గుప్పించారు. పైగా జిల్లా నాయకత్వం తనకు అండగా ఉండటం లేదన్న ఫీలింగ్ లో జేసీ ఉన్నట్టు టాక్ వినబడుతోంది. దానికి తోడు జేసీని వరుస కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. చంద్రబాబు అనంతపురం పర్యటనలో ఉన్న సమయంలో.. జేసీ దివాకర్‌రెడ్డి పోలీసులపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు.

అధికారంలోకి వచ్చాక తమ బూట్లు నాకే పోలీసులను పెట్టుకుంటామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై కేసు నమోదు కాగా.. అనంతపురం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆయన్ని సుమారు 8 గంటలపాటు విచారించారు. అరెస్ట్ చేస్తారేమోనని ముందస్తుగానే బెయిల్ తెచ్చుకున్నారు. కొంతకాలంగా ఆయన వ్యాపార సంస్థలపై కూడా ప్రభుత్వ దాడులు జరుగుతున్నాయి. దివాకర్ ట్రావెల్స్ కు చెందిన సుమారు 30 బస్సులను సీజ్ చేశారు. లారీల వ్యాపారాన్ని కూడా కట్టడి చేశారు. అంతేకాదు కాదు మైనింగ్ సంబంధించిన కేసు కూడా నడుస్తోంది. పైగా జేసీ అనుచరులపై కూడా పలు కేసులు నమోదయ్యాయి. వీటన్నిటి ఒత్తిడి మధ్య జేసీ రాజకీయాలు చేస్తున్నా .. ఆశించిన రీతిలో అధికారుల వద్ద తన మాట చెల్లుబాటు కావడం లేదన్న అభిప్రాయం జేసీ లో ఉందట. దాంతో బీజేపీ నేతలను కలిసి తన గోడు వెళ్లబోసుకుంటారేమో అని అనుకుంటున్నారు. మరి జేసీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News