కృష్ణానదికి పోటెత్తిన వరద
కృష్ణానదికి వరద ప్రవాహం పెరుగుతోంది. భారీగా వరద నీరు చేరుతుండటంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది.
కృష్ణానదికి వరద ప్రవాహం పెరుగుతోంది. భారీగా వరద నీరు చేరుతుండటంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద నీటి ప్రవాహం మరింత పెరగనుండటంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. పులిచింతల ప్రాజెక్టు నుంచి 6,44,700 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ప్రస్తుతం బ్యారేజ్కు ఇన్ఫ్లో 4,60,141 క్యూసెక్కులు కాగా 4,51,686 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. రాత్రికంతా 8 లక్షల క్యూసెక్కుల నీరు బ్యారేజ్కు చేరవచ్చని అధికారులు తెలిపారు.
నాగార్జునసాగర్ నుంచి ఏడు లక్షల నలబై వేల క్యూసెక్కుల నీరు కిందికి వస్తుండటం, దిగువున ఉన్న పులిచింతలలో ఇప్పటికే 38 టీఎంసీల నీరు నిల్వ ఉండటంతో అప్రమత్తమైన అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్లుగా ప్రకాశం బ్యారేజ్కు పంపిస్తున్నారు. దీంతో ఇప్పటికే భారీ స్థాయిలో వరద నీరు వస్తోన్న ప్రకాశం బ్యారేజ్కు రాత్రికంతా నాగార్జున సాగర్ నుంచి వదిలిన నీరు చేరుతుందనే అంచనాలతో రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేయాలని అధికారులు భావిస్తున్నారు.
వరద వస్తే ముంపు గ్రామాలకు ఇబ్బంది అంటున్న అధికారులు లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన విపత్తుల శాఖ లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఎగువ ప్రాంతాల నుంచి ఎంత వరద వస్తే అంత సముద్రంలోకి వదలాలని అధికారులు సూచించారు. ఇప్పటికే వరదనీరు పోటెత్తడంతో పలుచోట్ల పంటలు మునిగిపోయాయి. వరద ప్రవాహం ఇంకా పెరుగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.