బాబు గారు వ్యక్తిగతంగా కమిటీ సభ్యులను ఆక్షేపించే బదులు అమరావతి ప్రణాళిక తప్పిదాలు ఎక్కడ జరిగాయి అని సమీక్షించుకుంటే బాగుంటుందని మాజీ సీఎస్, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు సూచించారు. ఈ మేరకు చంద్రబాబుకు పరోక్షంగా ఆరు ప్రశ్నలను సంధించారాయన. వాటిలో..
1. పరిపాలన రాజధాని సరిపోయే పరిస్థితులలో మహా నగర నిర్మాణానికి పూనుకోవడం ఎంతవరకు సమంజసం?
2. మహా నగర నిర్మాణానికి ఎంచుకొని న స్థలం సరైనదా?
3. నిర్మాణానికి కావలసిన వనరుల గురించి సరైన అధ్యయనం జరిగిందా?
4. ప్రభుత్వ స్థలాలు కావలసినంత లభ్యంగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున భూ సమీకరణ చేసి రైతుల భవిష్యత్తును రాజధానితో ముడిపెట్టడం ఎంతవరకు సమంజసం?
5. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైవిధ్యాన్ని, శ్రీభాగ్ ఒప్పందం లాంటి చారిత్రక నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్ర రాజధాని ని ఏ విధంగా నిర్ణయిస్తారు?
6. ఒక మహా నగర నిర్మాణం ద్వారా రాష్ట్ర వనరులన్నీ కొద్ది ప్రాంతంలో కేంద్రీకృతం అయితే మిగిలిన ప్రాంతాల వర్గాల ప్రయోజనం కాపాడేది ఎలా? అనే ప్రశ్నలపై సమీక్షించుకోవాలని సూచించారు కృష్ణారావు.
ఇదే క్రమంలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన రెండు నివేదికలపై కూడా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. 'ఆరోజు శివరామకృష్ణన్ కమిటీ గాని ఈరోజు జిఎన్ రావు కమిటీ గాని (జిఎన్ రావు గారు కమిటీ కన్వీనర్ చైర్మన్ కాదు) బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కానీ ఈ అంశాలనే ప్రస్తావించి పరిష్కారాలను సూచిస్తున్నాయి.' అంటూ పేర్కొన్నారు.