విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడితే రాయలసీమ వాళ్లకు దూరం అవుతుందన్న వాదన ప్రస్తుతం నెలకొంది. ఈ వాదనను ప్రతిపక్షాలు బలంగా సమర్దిస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రెటరీ, బీజేపీ నాయకులు ఐవైఆర్ కృష్ణారావు మాత్రం విశాఖలో క్యాపిటల్ ను సమర్థిస్తున్నారు. అంతేకాదు.. రాయలసీమ వాళ్లకు విశాఖ దూరం కాదని అంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం రెండు పనులు చెయ్యాలని సూచించారు. 'రాత్రి ప్రయాణం తో గమ్యాన్ని చేరుకోగలిగితే దూరం భారం కాదు. అందువల్లనే హైదరాబాదును ఎవరు దూరం గా పరిగణించలేదు. విశాఖ కు రాష్ట్రం నలుమూలల నుంచి రాత్రి ప్రయాణం తో గమ్యం చేరే విధంగా రోడ్డు రైలు వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. రాయలసీమ నుంచి దూరం తగ్గించటానికి ప్రభుత్వం రెండు ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలి. గుంటూరు నంద్యాల రైల్వే లైన్ డబ్లింగ్. అనంతపురం విజయవాడ ఎక్స్ప్రెస్ వే. మొదటిది పనులు జరుగుతున్నాయి. రెండవది. కేంద్రం ఆమోదించింది. పని త్వరగా మొదలు అయ్యేట్లు చూడాలి.' అని కృష్ణారావు ఏపీ ప్రభుత్వానికి సూచించారు.
కాగా హైదరాబాద్ కు ధీటుగా అభివృద్ధి కాగలిగే అవకాశం తప్పకుండా వైజాగ్ కు ఉందని ఇదివరకే అన్నారు కృష్ణారావు. కానీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఒక్కటే పెట్టడానికి విశాఖ కరెస్ట్ కాదన్నారు. శాసనసభ, కార్యనిర్వహణ కేంద్రం ఒకేచోట ఉంటె బెటరని ఇదివరకే కృష్ణారావు సూచించారు. విశాఖలో ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కార్యాలయాల తోపాటు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టి అమరావతిలో లెజిస్లేచర్ క్యాపిటల్ తో సరిపెట్టవచ్చని చెప్పారు. ఇక కర్నూలు లో హైకోర్టు ఏర్పాటు చెయ్యాలన్న వాదన దీర్ఘకాలికంగా ఉందని అన్నారు. అయితే మూడు రాజధానుల అంశం సరైంది కాదని అన్నారు.
దీనిపై స్టడీ చెయ్యాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇదేక్రమంలో చంద్రబాబు వ్యూహం కూడా కరెక్ట్ కాదని అన్నారు. లక్షకోట్లు ఒకేచోట కేంద్రీకరించాల్సిన అవసరం లేదని వెల్లడించారు. రాజధానికి కావాల్సిన భవనాలు మౌలిక సదుపాయాలు ప్రపంచ స్థాయిలో వెయ్యి కోట్ల కన్నా తక్కువ వ్యయంతో నిర్మించవచ్చని కృష్ణారావు పేర్కొన్నారు. అమరావతిలో లక్షకోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినా జనాలు రాకుండా ఉంటే వృధా అవుతుందని చెప్పారు. అంతేకాదు అమరావతి మహానగరం కావాలంటే వందేళ్లు పడుతుందని చెప్పిన కృష్ణారావు.. అన్ని ప్రాంతాలకు అనువుగా ఉండే చోట రాజధానిని నిర్మించాలని ప్రభుత్వానికి సలహా ఇచ్చారు.