శ్రీకాకుళం జిల్లాలో ప్రమాదం సంభవించింది. హిర మండలం గొట్టా బ్యారేజ్ సమీపంలో కారు అదుపుతప్పి వంశధార ఎడమ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉండగా ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. ఒడిశా నుంచి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
విశాఖపట్నంలోని కోరమాండల్ ఫెర్టిలైజర్స్ సంస్థలో ఏరియా మేనేజర్లుగా పనిచేస్తున్న పవన్, బిందేటి చంద్రమోహన్తో పాటు మరో ముగ్గురు ఒడిశాలోని పర్లాఖముండి వెళ్లారు. అక్కడ సెంచూరియన్ యూనివర్సిటీలో సమావేశానికి హాజరై తిరిగి వస్తుండగా అర్ధరాత్రి గొట్టాబ్యారేజ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. పవన్ స్వస్థలం రాజమహేంద్రవరం కాగా చంద్రమోహన్ది ఖమ్మం. స్వల్ప గాయాలతో బయటపడిన వారు వెంకటగిరి ప్రసాద్, మహేశ్వరరావు, ఎస్.దుర్గా నాగ ప్రవీణ్గా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో కాలువలో 9 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. నీటిని నిలుపుదల చేసి మృతదేహాలను బయటకు తీశారు. అయితే అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. నీటిలో మునిగిపోయిన కారును తాడు సాయంతో బయటకు తీశారు.