వారిని అనుమతించేది లేదు.. ఏపీ సరిహద్దుకు వస్తే 2 వారాల క్వారంటైన్ : డీజీపీ గౌతమ్ సవాంగ్
ఆంధ్రప్రదేశ్లోని సొంత గ్రామాలకు వెళ్లాలనుకుని బయలుదేరి వచ్చి ఏపీ బోర్డర్లో నిలిచిపోయిన వారిని అనుమతించే ప్రసక్తే లేదని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్దంగా ఏపీ సరిహద్దు వద్దకు వస్తున్నవారిని రాష్ట్రంలోకి అనుమతించేది లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. రెండు వారాలపాటు క్వారంటైన్ నిర్వహించిన తర్వాతే రాష్ట్రంలోకి అనుమతి ఇస్తామని చెప్పారు.
బయటి వ్యక్తలను ఏపీలోకి అనుమతించబోమని ఆయన వెల్లడించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ ను జాతీయ విపత్తు గా ప్రకటించింది. ఎక్కడివారు అక్కడే ఉండాలని కోరుతున్నామన్నారు. కరోనా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సవాంగ్ కోరారు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వైరస్ సోకకుండా ఉండటానికే లాక్డౌన్ అని ఒకవేళ అనుమతిస్తే లాక్డౌన్ను ఉల్లంఘించినట్టేనని సవాంగ్ తెలిపారు. ప్రజలు పరిస్థితులను అర్థం చేసుకోవాలని కోరారు.