మారోసారి ప్రధాని మోడీ పై ఫైర్ అయ్యారు ఏపి సిఎం చంద్రబాబు .. 72 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో నరేంద్ర మోడీ వంటి భాద్యతరహితమైన ప్రధాని ఎవరు లేరని ధ్వజమెత్తారు . మోడీ హయాంలోనే ఇలాంటి దుస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. నరేంద్ర మోడీ హయాం మొత్తం కుంభకోణాల మయమైందని విమర్శించారు. పెద్ద నోట్లను రద్దు చేసి బ్యాంకింగ్ వ్యవస్థను నాశనం చేశారని అన్నారు. బ్యాంకుల పట్ల ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయేలా చేశారని చెప్పారు.
ముఖ్యంగా ఆర్థికమాంద్యం పరిస్థితుల్లోనూ బ్యాంకింగ్ వ్యవస్థ మన దేశానికి వెన్నెముకలా నిలిచిందని, అలాంటి బ్యాంకులను కూడా మోడీ నాశనం చేశారని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు అనేది అతి పెద్ద కుంభకోణమని పేర్కొన్నారు. పెద్ద నోట్లను రద్దు చేయడానికి గల కారణాలపై ఆరా తీయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు లేకుండానే వస్తు, సేవా పన్ను విధానాన్ని అమలు చేశారని, దీనివల్ల ప్రజలు , వ్యాపారులు అన్ని విధాలుగా నష్టపోయాయని జీఎస్టీ ఎవరికీ మేలు కలగటం లేదని, ఏ వర్గానికి ఉపయోగకరంగా లేదని అన్నారు.
జీఎస్టీని సరిగ్గా అమలు చేయకపోవడం వల్ల దేశం ఆర్థికంగా ఎంతో నష్టపోయిందని విమర్శించారు. దీని ప్రభావం వల్ల అంతర్జాతీయంగా రూపాయి విలువ దారుణంగా పడిపోయిందని అన్నారు. మోడీకి గానీ, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి గానీ ఆర్థిక వ్యవస్థపై ఏ మాత్రం అవగాహన లేదని, కనీస పట్టు లేదని ఆరోపించారు.దేశం చూసిన ప్రధానమంత్రుల్లో అస్సలు జవాబుదారితనం లేని ప్రధానినే అని పత్రికారంగం కూడా కోడై కూస్తోందని అన్నారు. తన అయిదేళ్ల పరిపాలనలో ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రెస్ కాన్ఫరెన్సు పెట్టని ప్రధాని మోడీ తప్ప మరెవరూ లేరని చెప్పారు. అయన మళ్ళి ప్రధాని అవ్వడం కలే అని విమర్శించారు .