గ్రీన్ జోన్లలో కార్యకలాపాలకు గ్రీన్ సిగ్నల్..ఇవి పాటించండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించిన గ్రీన్ జోన్ గల మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామాలు, కార్పొరేషన్లలో తగిన రక్షణ చర్యలతో ఆర్థిక కార్యకలాపాలకు, సంస్థలు, పరిశ్రమలు, వ్యవసాయ కార్యకలాపాల నిర్వహణకు ప్రభుత్వం అనుమతించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించిన గ్రీన్ జోన్ గల మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామాలు, కార్పొరేషన్లలో తగిన రక్షణ చర్యలతో ఆర్థిక కార్యకలాపాలకు, సంస్థలు, పరిశ్రమలు, వ్యవసాయ కార్యకలాపాల నిర్వహణకు ప్రభుత్వం అనుమతించింది.ఇందుకు సబంధించిన మార్గదర్శకాలు, సమగ్ర విధివిధానాలను వెలువరించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శనివారం నాడు ఉత్తర్వులిచ్చారు. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా వీటిని విడుదల చేశారు.
ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ మార్గదర్శకాలను 'RESTART' అని విశ్లేషించారు. ఆయా సంస్థల ఆపరేషన్ల రిజిస్ట్రేషన్, అవగాహన కార్యక్రమాలు, భౌతిక దూరం పాటించడం, ఉష్ణోగ్రతలు వివరాలు స్క్రీనింగ్ చేయడం, ఒకరితో ఒకరి భేటీలు నివారించడం, నిఘా, ట్రాకింగ్ వంటి అంశాలు ఉన్నాయి.
* గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, సాగునీటి ప్రాజెక్టు పనులు, భవన నిర్మాణాలకు.. ఐటీ సంస్థల్లో 50శాతం ఉద్యోగులతో పనులకు, అన్ని రకాల వస్తు రవాణాకు అనుమతి
* వాహనాల మరమ్మతు కేంద్రాలు, జాతీయ రహదారి పక్కన దాబాలను నిబంధనల మేరకు నిర్వహించుకోవచ్చు.
* ఆయా సంస్థలన్నీ వారి ప్రాథమిక సమాచారంతో నిర్ణీత ఫారంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ప్రభుత్వం
విడుదల చేసిన జీవోఆర్టీ నంబర్ 88, తేదీ 18.4.2020లో ఉన్నాయి.
* అన్ని మిల్లులు, పాల ఉత్పత్తి కేంద్రాలు, ఆహార తయారీ పరిశ్రమలు.. మందులు, డిటర్జెంట్ల కంపెనీలు, మాస్కుల తయారీ, ప్యాకేజీ కేంద్రాల వంటివి పనిచేయవచ్చు.
* 30 నుంచి 40శాతం రవాణా సామర్థ్యంతో వాహనాల్లోనే ఉద్యోగులను తరలించాలి.
రెడ్ జోన్ల పరిధిలోని మండలాలు, మున్సిపాలిటీలకు మినహాయింపులు లేవన్నారు. గ్రీన్ జోన్లలో పారిశ్రామిక కార్యకలాపాలపై మేజిస్టరేట్ ఆధ్వర్యంలోని జిల్లా స్థాయి కమిటీలు నిర్ణయం తీసుకోవాలని నీలం సాహ్ని తెలిపారు. తహసీల్దార్, ఎంపీడీవో, కార్మిక శాఖ అధికారులు ఆయా ప్రాంతాల్లో ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ పరిమిత స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. శనివారం కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో సీఎస్ విజయవాడ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గ్రీన్ జోన్లలో లాక్డౌన్ మినహాయింపులకు సంబంధించి పోలీసులు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని డీజీపీ గౌతం సవాంగ్ అధికారులను ఆదేశించారు.