జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. మే 3 వరకు ఆ సేవలన్నీ బంద్
కరోనా మహమ్మారి కట్టడికి మే 3 వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే.
కరోనా మహమ్మారి కట్టడికి మే 3 వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దేశంలోని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నాయి. తెలంగాణ, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాలు సడలింపులు ఇవ్వలేదు. లాక్ డౌన్ లో కొనసాగుతున్నందున పలు సేవలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే ఆన్ని సేవలన్నీ నిలిచి పోయాయి అని ప్రభుత్వం ప్రజలకు మరోసారి స్పష్టం చేసింది.
లాక్ డౌన్ సమయంలో అన్ని మత సంబంధ ప్రదేశాలు, ప్రార్థనా స్థలాల్లో నిషేధం ఉంటుందని పేర్కొంది. ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలకు 20 మందికే అనుమతి ఉంటుందని తెలిపింది. ఇక అన్ని సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద కార్యక్రమాలతో పాటు విద్యా, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలు, ఇతర అన్ని సామూహిక కార్యకలాపాలు జరపకూడదని తేల్చి చెప్పింది. రాష్ట్రాల మధ్య రాకపోకలు, అన్ని విద్యా సంస్థలు, ట్రైనింగ్, కోచింగ్ సంస్థలు, ప్రత్యేక అనుమతి పొందిన వాటి మినహా అన్ని పారిశ్రామిక, ఆర్థిక వ్యవహారాలను నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలు, రక్షణ అవసరాలకు తప్పించి ఇతర రైలు ప్రయాణాలు, ప్రజా రవాణా వ్యవస్థ, మెట్రో రైలు సర్వీసులు, అత్యవసర వైద్య సేవలు మినహా మిగిలిన వాటిపై నిషేదం వుంటుంది.
టాక్సీ, క్యాబ్, ఆటో సర్వీసులు, అన్ని సినిమా హాళ్లు, మాల్స్, షాపింగ్ కాంప్లెక్సులు, వ్యాయామశాలలు, క్రీడా ప్రాంగణాలు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్కులు, బార్లు, ఆడిటోరియాలు, అసెంబ్లీ హాల్స్ వంటి ప్రదేశాల్లో నిషేధం ఉంటుందని ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది.