రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేవలం రెండు రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహించనున్నారు. తొలిరోజు ఉదయం గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్నారు. ఇందు కోసం రాజ్ భవన్, అసెంబ్లీలో ఏర్పాట్లు చేశారు. మధ్యాహాన్నానికి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం..ఆ వెంటనే 2020-21 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
అసాధారణ రీతిలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కరోనా కారణంగా అన్ని సంప్రదాయాలకు భిన్నంగా కేవలం రెండే రెండు రోజులకు బడ్జెట్ సమావేశాలను పరిమితం చేశారు. గవర్నర్ అసెంబ్లీకి రాకుండానే రాజ్భవన్ నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అంతేకాదు, గవర్నర్ ప్రసంగం చేసిన రోజునే బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టనున్నారు. అంటే, రెండే రెండు రోజులపాటు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరనున్నాయి. కరోనా కల్లోలం నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కోవిడ్ జాగ్రత్త చర్యలను సూచిస్తూ వైద్యారోగ్యశాఖ నోట్ విడుదల చేసింది.
ఈ జాగ్రత్తలు పాటించండి
► సభ్యులందరూ తప్పనిసరిగా అన్ని సమయాల్లో మాస్క్లు ధరించాలి. సభా మందిరంలోకి ప్రవేశించే ముందు శానిటైజర్లతో చేతులను శుభ్రపర్చుకోవాలి. సభా ప్రాంగణంలో ప్రవేశించే ముందుగానే ఉష్ణోగ్రతను తెలిపే థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. లాబీలు, గ్యాలరీల్లో సభ్యులు గుమిగూడకూడదు.
► లిఫ్ట్లో ఇద్దరి కంటే ఎక్కువ ప్రయాణించకూడదు. సభా మందిరంలో సభ్యులు రెండు మీటర్ల భౌతిక దూరం పాటించాలి.
► జ్వరం, దగ్గు, ఆయాసం, వాసన, రుచి కోల్పోవడం వంటి లక్షణాలు ఉన్నట్టు గుర్తిస్తే తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
► 60 ఏళ్ల వయసు దాటిన సభ్యులు, మధుమేహం, రక్తపోటు, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నవారికి కోవిడ్–19 వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మరింత జాగ్రత్తగా ఉండాలి.
► మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పీఎస్లు, పీఏలు, పీఎస్వోలను తీసుకురాకూడదు. సందర్శకులను అనుమతించరు. అసెంబ్లీ ఆవరణలో ఆందోళనలకు అనుమతి లేదు.