మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడి అరెస్టు వ్యవహారంపై విశాఖ ఏసీబీ అధికారులు స్పందించారు. ఈరోజు ఉదయం 7.30గంటలకు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని ఆయన స్వగృహంలో అరెస్టు చేసినట్లు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ వెల్లడించారు. వారితో పాటు సీకే రమేష్, జి.విజయకుమార్, డాక్టర్ జనార్దన్, ఈ. రమేష్బాబు, ఎంకేబీ చక్రవర్తిలను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
ఈఎస్ఐలో ప్రధానంగా మందులు, ల్యాబ్ కిట్స్, సర్జికల్ ఐటమ్స్, ఫర్నిచర్ కొనుగోళ్లకు సంబంధించి అక్రమాలు జరిగాయన్నారు. మాజీ డైరెక్టర్ సీకే రమేశ్ కుమార్ బంధువుల పేర్లమీద నకిలీ కొటేషన్లతో మార్కెట్ ధర కంటే 50 నుంచి 130 శాతం అధిక ధరలకు కోట్ చేశారన్నారు. ఈ-టెండర్ల విధానంలో కాకుండా నామినేషన్ పద్ధతిలో కొనుగోళ్లు చేశారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం రూ.988 కోట్లు కేటాయిస్తే .. అందులో రూ.150 కోట్ల వరకు అవినీతి జరిగినట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వ నిధులు దుర్వినియోగం జరిగినట్టు నిర్ధారణ జరిగినట్లు తెలిపారు. ఫేక్ ఇన్వాయిస్తో మందులు కొనుగోలుకు పాల్పడ్డారని చెప్పారు. అచ్చెన్నాయుడు కనీసం ప్రిన్సిపాల్ సెక్రటరీ కూడా తెలియకుండా కొన్ని ప్రక్రియలు చేశారన్నారు. విజిలెన్స్ రిపోర్ట్పై ప్రభుత్వ అదేశాలుపై ఏసీబీ కేసు విచారణ చేస్తూ అరెస్ట్ చేసినట్లుగా ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ వెల్లడించారు. ఈ ముగ్గురినీ విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తాం అని తెలిపారు.
జగన్ డైరెక్షన్లో ఏసీబీ.. రాష్ట్రంలో రాక్షస పాలనకు నిదర్శనం: యనమల