ఏపీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఉదయం 9గంటల తర్వాత మరో ముగ్గురికి కరోనా సోకినట్టు నిర్ధారించారు. అంటే ఇవాళ ఒక్కరోజే ఇప్పటి వరకు 24 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 135కి చేరింది.
ఢిల్లీలో నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారికి కరోనావైరస్ సోకడం వల్లే రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో పెరుగుతన్న కేసులను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఉన్న నాలుగు టెస్టింగ్ సెంటర్లతో పాటు మరో రెండు టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేశారు. ఈ మేరకు కడప, గుంటూరులలో ల్యాబ్స్ అందుబాటులోకి వచ్చాయి. విశాఖలో మరో టెస్టింగ్ ల్యాబ్ను సిద్ధం చేస్తున్నారు. అందుబాటులోకి వచ్చిన కొత్త టెస్టింగ్ సెంటర్లతో ప్రస్తుతం రోజుకు 450గా ఉన్న కరోనా టెస్ట్ల సంఖ్య 570కి చేరనుంది.