మంత్రివర్గ కూర్పుపై ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. శనివారం మంత్రివర్గం ప్రమాణస్వీకారం జరగనున్న నేపథ్యంలో కేబినెట్లో ఎవరెవరికి చోటు కల్పించాలన్న అంశంపై దాదాపు స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పదహారు మంది ఎమ్మెల్యేలకు మంత్రి మండలిలో చోటు దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. ఇపుడు పలువురు నేతలకు సీఎం కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్తున్నట్టు సమాచారం. కడప జిల్లా రైల్వే కోడూరు వైకాపా ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులుకు జగన్ కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రోజు ఆయనకు సీఎంవో నుంచి ఫోన్ రావడంతో హుటాహుటిన అమరావతికి బయల్దేరి వెళ్లారు. రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి ఆయన వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొదట్నుంచి ఆయన వైఎస్ కుటుంబానికి, వైకాపాకు విధేయుడిగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి నరసింహ ప్రసాద్పై కొరముట్ల విజయం సాధించారు.