18 వ రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

18 వ రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె
x
Highlights

♦ 10.30 గం.లకు జూబ్లీ బస్టాండ్‌ ఆవరణలో వంటావార్పు ♦ అన్ని డిపోల ఎదురుగా తాత్కాలిక సిబ్బందికి విజ్ఞప్తులు ♦ విధులకు హాజరుకావొద్దంటూ వినతలు ♦ నిజామాబాద్‌లో తాత్కాలిక సిబ్బంది కాళ్లు మొక్కిన ఆర్టీసీ కార్మికులు

ఆర్టీసీ సమ్మె 18 వ రోజు కొనసాగుతోంది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల దగ్గర తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు విధులకు హాజరుకావొద్దంటూ ఆర్టీసీ కార్మికులువిజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణ బంద్‌ తర్వాత ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన కార్యాచరణ ప్రకారం డిపోల దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు సికింద్రాబాద్‌ జూబ్లీ బస్‌స్టేషన్‌ దగ్గర వంటా వార్పు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డిపో ఎదురుగా ఆర్టీసీ కార్మికులు తెల్లవారుజాము నుంచే నిరసన చేపట్టారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు బస్సుల నడపొద్దంటూ డిపో ఎదురుగా బైటాయించారు. తమ పొట్ట కొట్టొద్దంటూ విజ్ఞప్తి చేశారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఉదయమే భారీగా చేరుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న కార్మికులను అడ్డుకున్నారు. మరోవైపు నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో రెండు డిపోల పరిధిలో ఆర్టీసీ కార్మికులు నిరసనలు చేపట్టారు. ఉదయమే డిపోలకు చేరుకున్న తాత్కాలిక సిబ్బందికి విధులకు హాజరుకావొద్దంటూ ఆర్టీసీ రెగ్యులర్‌ కార్మికులు విజ్ఞప్తి చేశారు. పూలు ఇస్తూ తమ పొట్ట కొట్టొద్దంటూ గాంధీగిరి విధానంలో విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా నిజామాబాద్‌ వన్ డిపో లోపలికి వెళ్లేందుకు క్యూలో నిలబడ్డ తాత్కాలిక సిబ్బంది కాళ్లపై పడ్డారు. కాళ్లు మొక్కుతాం విధులకు హాజరుకావొద్దంటూ విజ్ఞప్తి చేశారు. తమ సమ్మెకు సహకరించాలని కోరారు. గడ్డాలు పట్టుకుని బతిమిలాడారు. ఇటు పోలీసులు కూడా డిపో ఎదుటభద్రత ఏర్పాటు చేశారు.

ఇటు కరీంనగర్ బస్‌స్టాండ్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బస్టాండ్‌లో పార్క్ చేసిన ఉన్న ప్రైవేట్‌ హైర్‌ సర్వీస్‌ బస్‌ అద్దాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీశారు. బస్టాండ్‌ ఆవరణలో గుంపులుగా ఉన్న జనాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. మరోవైపు ఉదయం 5 గంటలకే కరీంనగర్‌ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ధర్నా చేపట్టారు. బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు పెద్ద సంఖ్యలో భద్రత ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories