అటవీ సంరక్షణ ప్రధాన అధికారి పీకే ఝా పదవీ విరమణ
అటవీ సంరక్షణ ప్రధాన అధికారిగా పీకే ఝా ఈరోజు పదవీ విరమణ చేశారు ఈ సందర్భంగా ఆయనకు అరణ్య భవన్ లో వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ ఆత్మీయ వీడ్కోలు సభకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి,సీఎస్ ఎస్కే జోషి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అటవీ భూమూల రక్షణ, అటవీ సంరక్షణకు పీసీసీఎఫ్ పీకే ఝా ఎంతో కృషిచేశారని ప్రశంసించారు. మూడేళ్లకు పైగా అటవీ సంరక్షణ ప్రధాన అధికారిగా సుదీర్ఘకాలం ఈ హోదాలో పనిచేసిన అతి కొద్ది మంది అటవీ ఉన్నతాధికారుల్లో పీకే ఝా ఒకరని అన్నారు. అటవీ సంరక్షణ విషయంలో చాలా పీకే ఝా అంకితభావంతో పని చేశారని ఆయన సేవలను కొనియాడారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరంతో సహా అనేక ప్రాజెక్టులకు అటవీ, పర్యావరణ అనుమతులు రికార్డు వేగంతో సాధించేలా తన టీమ్ తో కలిసి పనిచేశారని తెలిపారు. తెలంగాణకు హరితహారం సమర్థవంతంగా అమలు అయ్యేలా నిరంతరం పర్యవేక్షించారన్నారు. పీకే ఝా సేవల వల్ల అటవీ శాఖకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, ఇదే స్పూర్తితో హరిత హారం, అటవీ రక్షణకు అటవీ శాఖ అధికారులు కృషి చేయాలని అభిలాషించారు.
సీఎస్ ఎస్కే జోషి మాట్లాడుతూ..... పీకే ఝా నేతృత్వంలో అటవీ శాఖ సమర్ధవంతంగా పని చేసిందన్నారు. అర్బన్ ఫారెస్ట్ పార్కులను అద్భుతుంగా తీర్చిదిద్దారని కొనియాడారు. పీకే ఝా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి సహాకారం వల్లే తాను విజయవంతంగా పని చేయగలిగానని, తనకు సహాకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ పృథ్వీరాజ్,అడిషన్ పీసీసీఎఫ్ లు మునీంద్ర, డోబ్రియల్,స్వర్గం శ్రీనివాస్, ఫర్గేన్ లోకేష్ జైస్వాల్, అన్ని జిల్లాలకు చెందిన సీఎఫ్ వోలు,డీఎఫ్ వోలు,ఎఫ్ డీవోలు, అరణ్య భవన్ లోపని చేసే ఇతర అధికారులు,సిబ్బంది, అటవీ శాఖకు అనుబంధంగా ఉన్న వివిధ సంఘాల ప్రతినిదులు పాల్గొన్నారు.
కాగా, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (ఇంఛార్జి)గా ఆర్. శోభను నియమించారు. ఆమె ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు.




