ఊయలలా ఊగే రాతి మండపం ఎక్కడ ఉందో తెలుసా?

ఊయలలా ఊగే రాతి మండపం ఎక్కడ ఉందో తెలుసా?
x
Highlights

పంచారామాలలో ఒకటయినది కుమారభీమారామము. ఈ క్షేత్రం ప్రశాంతంగా చుట్టూ పచ్చని పంటచేలతో సామర్లకోటకు కిలోమీటరు దూరంలో ఉంటుంది.

పంచారామాలలో ఒకటయినది కుమారభీమారామము. ఈ క్షేత్రం ప్రశాంతంగా చుట్టూ పచ్చని పంటచేలతో సామర్లకోటకు కిలోమీటరు దూరంలో ఉంటుంది. ఇక్కడ లింగం కూడా 14 అడుగుల ఎత్తునరెండంతస్తుల మండపంగా భక్తులకు దర్శనం ఇస్తుంది. శివునికి పూజలు చేయాలనుకుంటే పై అంతస్తులోకి వెళ్ళి పూజలు జరపాలి. మహాశివరాత్రి రోజున ఇక్కడ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.

ఆలయం చరిత్ర:

సామర్లకోట లోని భీమేశ్వరాలయాన్ని చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని చరిత్రలో వివరించారు. ఈయనే ద్రాక్షారామ క్షేత్రాన్ని కూడా ఈయనే నిర్మించాడు. అందుకే ఈ రెండు ఆలయాలు ఒకే రీతిగా వుంటాయి. అంతే కాదు రెండు ఆలయాల నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకటేరకంగా, నిర్మాణ శైలికూడా ఒకే విధంగా వుంటుంది.ఈ ఆలయ నిర్మాణం క్రీ.శ 892 లో ప్రారంభమై సుమారు క్రీ.శ. 922 వరకు సాగింది. ఆలయం నిర్మాణం చాలా చక్కని శిల్ప కళ కలిగి ఇప్పటికీ పగుళ్ళు లేకుండా ఉంది. ఇక్కడి శివలింగం తెల్లని రంగులో భక్తులకు దర్శనం ఇస్తుంది. 1340-1466 మధ్యకాలంలో కాకతీయులు ఈ మందిరాన్ని కొంత పునర్మిర్మించారు. ఇక్కడ కాకతీయుల నాటి శిల్ప కళను, అంతకు పూర్వపు తూర్పు చాళుక్యులనాటి శిల్ప కళను తేలికగా గుర్తించవచ్చును.

ఆలయ విశేషాలు:

ఇక్కడ ఆలయంలోని ఈశ్వరుడు కుమార భీమేశ్వరుడుగా ప్రసిద్ధిచెందగా, అమ్మవారు బాలాత్రిపురసుందరిగా పూజలు అందుకుంటోంది. విశాలమైన ప్రాకారాలతో, నాలుగు ద్వారాలతో, కోనేటి జలాలతో,చాళుక్యుల శిల్పకళా నైపుణ్యంతో అలరారుతోన్న ఈ క్షేత్రాన్ని దర్శించగానే మనసుకి ఎంతో ఆహ్లాదం, ఆనందం కలుగుతాయి. దేవాలయం లోపలి ప్రాకారంలో వినాయకుడు, కాల భైరవుడు, వీరభద్రుడు, మహాకాళి, శనేశ్వరుడు, నవగ్రహాలు కొలువుతీరి కనిపిస్తాయి. ప్రధాన ద్వారానికి ఎడమవైపున బాలాత్రిపురసుందరి అమ్మవారు కుడి వైపున ఊయల మంటపం కనిపిస్తాయి. గర్భగుడిలో రెండో అంతస్తు వరకూ పెరిగిన 14 అడుగుల భీమేశ్వరుడి శివలింగం నయనానందాన్ని కలిగిస్తుంటుంది. నిర్మాణ సమయంలోనే ఈ శివలింగం అంతకంతకు పెరిగిపోతుండటం గమనించి శిల్పులు శివలింగం పైభాగాన చీల కొట్టారనే కథ స్థానికంగా వినిపిస్తూ వుంటుంది. ఇదే కథ ఈ ఆలయానికి పది కిలోమీటర్ల దూరంలోని పెదబ్రహ్మదేవం పొలాలలో నెలవైన మాణిక్యాంబ సమేత రాజరాజేశ్వరుని విషయంలోను వినబడుతూ ఉంది. ఎదురుగా ఆరు అడుగుల ఎత్తులో నందీశ్వరుడు ఆసీనుడై ఉంటాడు.

గుడిలో స్వామి వారికి ఎదురుగా మండపంలో వున్న నంది విగ్రహం ఏక శిలచే చెక్కబడింది. ఆలయంలోని మండపం నూరు రాతిస్తంభాలనుకలిగి ఉంటుంది. రెండో అంతస్తువరకు దాదాపు 14 అడుగులున్న శివలింగం, సున్నపు రాయి చే నిర్మితమై శివలింగఆధారం క్రింది గదిలో వుండగా, లింగ అగ్రభాగం పై కప్పును చీల్చుకొని మొదటి అంతస్తు వరకుండును. భక్తులు పూజలు, అర్చనలు ఇక్కడే చేయుదురు. మొదట మొదటి అంతస్తులో వున్న లింగ దర్శనం తరువాత క్రిందవున్న లింగ పాద భాగాన్ని భక్తులు దర్శించుకుంటారు. మొదటి అంతస్తుకు చేరుటకు ఇరువైపులనుండి మెట్లు ఉన్నాయి.

ఈ దేవాలయ నిర్మాణం పంచారామాలలో ఒక్కటైన ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయాన్ని పోలివుంటుంది. అక్కడిలానే ఈ దేవాలయం చుట్టు రెండు ఎత్తయిన రెండు ప్రాకారాలను కలిగివున్నది.ప్రాకారాపు గోడలు ఇసుక రాయితో కట్టబడినవి. వెలుపలి ప్రాకారపు గోడకు నాలుగుదిక్కులలో నాలుగు ప్రవేశ మార్గాలున్నాయి. ప్రదాన ప్రవేశ ద్వారాన్ని సూర్య ద్వారం అంటారు. గుడిలోని స్తంభాల మీద అప్సర బొమ్మలు చెక్కబడివున్నవి. చాళుక్య వంశానికి చెందిన విక్రమాదిత్యుని పుత్రుడు చాళుక్య భీమేశ్వర కుమరరామ పేరుమీదుగా ఇక్కడి శివున్ని కుమారారామ అని వ్యవహారంలోకి వచ్చినట్లు తెలుస్తున్నది.

ఉత్సవాలు పూజలు:

ఇక చైత్ర, వైశాఖ మాసాల్లో సూర్య కిరణాలు ఉదయం వేళలో స్వామివారి పాదాలను సాయంత్రం సమయంలో అమ్మవారి పాదాలను తాకడం ఇక్కడి విశేషంగా చెప్పుకుంటారు. శివరాత్రికి ముందు వచ్చే ఏకాదశి రోజున భీమేశ్వరస్వామికి బాలత్రిపురసుందరికి వైభవంగా వివాహ మహోత్సవం జరిపిస్తారు. అయిదు రోజులపాటు జరిగే ఈ వేడుకల్లో స్వామివారిని నందివాహనంపై అమ్మవారిని సింహవాహనంపై ఊరేగిస్తారు. ఈ కల్యాణాన్ని తిలకించడానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలంతా వస్తుంటారు. ఇక కార్తీక మాసంలో కూడా ఇక్కడ పూజలు . అభిషేకాలు, ఉత్సవాలు విరివిగా జరుగుతూ వుంటాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ భక్తులు పునీతులవుతుంటారు.

ఊయలలాగా ఊడే రాతి మండపం:

ఆలయం ప్రాంగణంలోని ఉత్తరం వైపున ఉన్న రాతి మండపాన్ని భక్తులు కొద్దిగా ప్రయత్నించి ఊపితే అది ఊయలలాగా ఊగుతుంది. అది ఆ నాటి శిల్పుల పనితనానికి ఓ మచ్చుతునక అనే చెప్పుకోవాలి.

వజ్రగణపతి:

ఆలయానికి పడమర దిక్కులో ఉన్న గోడపై గణపతి విగ్రహం ఉంది. ఆ విగ్రహానికి నాభిలో కాంతి వంతమైన వజ్రం ఉండేదని, ఆ వజ్రం నుంచి ప్రతిఫలించే కాంతులు రాత్రి భక్తులకు మార్గ దర్శకంగా ఉండేవంట.అందుకే ఆ గణపతిని వజ్రగణపతి అంటారని చరిత్ర.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories