హిందువులు పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాథల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు అంటారు.
హిందువులు పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాథల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు అంటారు. ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు. సతీ దేవి శరీరం 18 ముక్కలై, 18 ప్రదేశాల్లో పడ్డాయని, వాటినే అష్టాదశ శక్తి పీఠాలు అంటారని మన పురాణాలు తెలుపుతున్నాయి. ఈ శక్తి పీఠాలు భారత దేశంతో సహా శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్ వంటి మూడు దేశాలలో కూడా ఉన్నాయి. వాటితో ఒకటి కాశ్మీర్ లో ఉండగా, మరొకటి శ్రీలంకలో ఉంది. మిగతా 16 శక్తిపీఠాలు మన భారత దేశంలో ఉన్నాయి.
పురాణ కథ
శక్తి పీఠాల ఉద్భవం వెనుక ఒక విషాధ గాథ ఉన్నట్లు మన పురాణాల్లో తెలుపుతున్నాయి. బ్రహ్మ దేవుడి కుమారులలో దక్షప్రజాపతి ఒకరు. అతనికి యాబై మూడు మంది కుమార్తెలుండేవారు. వారిలో చంద్రునికి ఇరవై ఏడు గురిని, కశ్యప మహర్షికి పదమూడు మందని, దుర్ముణకు పది మందిని, పితురులకు ఒకరిని, అగ్నికి ఒకరిని ఇచ్చి వివాహం చేసారు. సతీదేవి మాత్రమే మిగిలింది. కాగా దేవికి చిన్నతనం నుంచే శివుడంటే అపారమైన భక్తి. కానీ దక్షడు ఈశ్వరునికి సతీదేవిని ఇచ్చి వివాహం జరిపించుటకు ఇష్టపడలేదు. అయినప్పటకీ పార్వతీ దేవి తండ్రి మాటను జవదాటి పరమేశ్వరున్ని పెళ్ళాడింది. దీంతో దక్షప్రజాపతికి శివునిపై మరింత కోపాన్ని పెంచుకున్నాడు.
ఒకరోజు దక్షుడు బృహస్పతియాగం చేసాడు. ఆ కార్యక్రమానికి దేవతలందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు. అయినా పార్వతీ దేవి పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది. కానీ అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు.
సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని (శివుని) తోడుగా దర్శనమిస్తుంది.
18 శక్తిపీఠాలు
♦ శాంకరి
శ్రీలంకలో తూర్పుతీరంలో ట్రిన్కోమలీలో ఈ ఆలయం ఉంది. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమయ్యిందంటారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రం ఉంది. దగ్గరలో 'త్రికోణేశహవర స్వామి' అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది. ట్రిన్కోమలీ నగరంలో కాళీమందిరం ప్రసిద్ధమైనది.
దేశంలో ఉన్న అష్టాదశ శక్తి పీఠాలు ఇవే..
♦ కామాక్షి
కాంచీపురం, తమిళనాడు మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఆ పీఠం ఉంది.
♦ శృంఖల
ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్ కొలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాని ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు. అయితే కొలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింపబడుతున్నది.
♦ చాముండి
క్రౌంచ పట్టణము, మైసూరు, కర్ణాటక - అమ్మవారు చాముండేశ్వరీ దేవి.
♦ జోగులాంబ
ఆలంపూర్, తెలంగాణ - కర్నూలు నుండి 27 కిలోమీటర్ల దూరంలో 'తుంగభద్ర' & క్రిష్ణ నదులు కలిసే స్థలంలో ఉంది.
♦ భ్రమరాంబిక
శ్రీశైలం, ఆంధ్ర ప్రదేశ్ - కృష్ణా నదీ తీరాన అమ్మవారు మల్లికార్జునస్వామి సమేతులై ఉంది. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో కుడా ఒకటి.
♦ మహాలక్ష్మి
కొల్హాపూర్, మహారాష్ట్ర - ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది. అమ్మవారి తలపైన ఐదు తలల శేషుని ఛత్రం ఉంది. ప్రతి సంవత్సరం మూడు మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది.
♦ ఏకవీరిక
మాహుర్యం లేదా మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర - ఇక్కడి అమ్మవారిని 'రేణుకా మాత'గా కొలుస్తారు. షిరిడీ నుండి ఈ మాతను దర్శించుకొనవచ్చును.
♦ మహాకాళి
ఉజ్జయిని, మధ్య ప్రదేశ్ - ఇదే ఒకప్పుడు అవంతీ నగరం అనబడేది. ఇది క్షిప్రా నది తీరాన ఉంది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే.
♦ పురుహూతిక
పీఠిక్య లేదా పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ - కుకుటేశ్వర స్వామి సమేతయై ఉన్న అమ్మవారు.
♦ గిరిజ
ఓఢ్య, జాజ్పూర్ నుండి 20 కిలోమీటర్లు, ఒడిషా - వైతరిణీ నది తీరాన ఉంది.
♦ మాణిక్యాంబ
దక్షవాటిక లేదా ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్ - కాకినాడనుండి 20 కిలోమీటర్ల దూరంలో.
♦ కామరూప
హరిక్షేత్రం, గౌహతి నుండి 18 కిలోమీటర్లు, అసోం - బ్రహ్మపుత్రా నది తీరంలో. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది.
♦ మాధవేశ్వరి
ప్రయాగ (అలహాబాదు), ఉత్తర ప్రదేశ్, త్రివేణీ సంగమం సమీపంలో - ఈ అమ్మవారిని అలోపీ దేవి అని కూడా అంటారు.
♦ వైష్ణవి
జ్వాలాక్షేత్రం, కాంగ్రా వద్ద, హిమాచల్ ప్రదేశ్ - ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడు జ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి.
♦ మంగళ గౌరి
గయ, బీహారు - పాట్నా నుండి 74 కిలోమీటర్లు.
♦ విశాలాక్షి
సతీదేవి 'మణికట్టు' పడిన స్థలం కాశీ పుణ్య క్షేత్రం. శివుని విశిష్ట స్థానంగా కాశి/వారణాశి విరాజిల్లుతోంది. వరుణ, అసి అనే రెండు నదుల సంగమం. గంగాస్నానం, విశ్వేశ్వరుడు, విశాలాక్షి దర్శనం నయానందకరం. శుభకరం.
♦ సరస్వతి
జమ్ము, కాష్మీరు - అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు.పాక్ ఆక్రమిత కాశ్మీరులో ముజఫరాబాద్ కు 150 కి.మీ.ల దూరంలోఉందంటారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire