తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కొనసాగిన ఉత్కంఠకు తెరదించుతూ తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. క్లియర్ కట్ మెజార్టీతో అధికార పార్టీ మరోసారి...
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కొనసాగిన ఉత్కంఠకు తెరదించుతూ తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. క్లియర్ కట్ మెజార్టీతో అధికార పార్టీ మరోసారి విజయ ఢంకా మోగించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాల కన్నా ఎక్కువ సీట్లనే సాధించింది. అయితే, ఉత్తరతెలంగాణలో గతంలో కన్నా ఎక్కువ చోట్ల కారుజోరు కొనసాగింది. గులాబీ పార్టీ తన పట్టును మరింత పెంచుకుంది. ఉద్యమాల పురిటిగడ్డ, రాజకీయ చైతన్యానికి జీవగడ్డ ఉత్తర తెలంగాణ. మొదట నుంచి ఈ ప్రాంతానికి తెలంగాణలో రాజకీయ చైతన్యం ఎక్కువ. తెలంగాణ ఉద్యమ సమయంలో గానీ, తెలంగాణ సాధించి 2014లో ఎన్నికలకు వెళ్లినప్పుడుగానీ ఈ ప్రాంత ప్రజలు టీఆర్ఎస్ కు మెజార్టీ స్థానాలను కట్టబెట్టారు. నాలుగున్నరేళ్ల తర్వాత ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఇక్కడ కారుజోరు తగ్గలేదు. అంతేకాదు, గతం కన్నా ఎక్కువ స్థానాల్లో పాగా వేసింది. ఉత్తర తెలంగాణలోని 54 స్థానాల్లో టీఆర్ఎస్ 39 సీట్లను, కాంగ్రెస్ 11, టీడీపీ రెండు, స్వతంత్రులు రెండు స్థానాలను గెలుచుకున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 స్థానాల్లో టీఆర్ఎస్ తొమ్మిది, కాంగ్రెస్ ఒకటి గెలుచుకున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 సీట్లలో ఎనిమిది అధికార పార్టీ విజయం సాధించగా ఎల్లారెడ్డి అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ సొంతం చేసుకుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ 11 చోట్ల పగా వెయ్యగా కాంగ్రెస్ ఒక స్థానంతో సరిపెట్టుకుంది. రామగుండంలో స్వతంత్ర అభ్యర్థి చందర్ గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లాలో టీఆర్ఎస్ 12 స్థానాలు దక్కించుకోగా ఈసారి మరో స్థానాన్ని కోల్పోయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో పదిచోట్ల కారుజోరు కొనసాగింది. ములుగు, భూపాలపల్లి మాత్రం హస్తగతం అయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం పార్టీ అంతర్గత కుమ్ములాటలతో టీఆర్ఎస్ ఒక స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
గతంలో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 37 స్థానాలను గెలుచుకోగా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలతో ఆ సంఖ్య అసెంబ్లీ రద్దు నాటికి 49కి చేరింది. అయితే, ఇప్పుడు తాజా ఎన్నికల్లో మరో రెండు సీట్లను అదనంగా గెలుచుకుని, ఉత్తర తెలంగాణలో తన పట్టును పెంచుకుంది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో గతంలో కన్నా ఒక్కొ సీటు తగ్గినా.. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో మాత్రం 2014 కన్నా ఎక్కువ సీట్లనే సొంతం చేసుకుంది. మొత్తం ఐదు జిల్లాలు కలిపి 2014లో కాంగ్రెస్ 8 నియోజకవర్గాల్లో మాత్రమే విజయం సాధించగా ఈసారి పదకొండు చోట్ల గెలుపొందింది. గతంలో టీడీపీ 3 స్థానాలను సొంతం చేసుకోగా ఇప్పుడు ఒక సీటు కోల్పోయి రెండు నియోజకవర్గాలతో సరిపెట్టుకుంది. రామగుండం, వైరా స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. మొత్తం మీద తాజా ఎన్నికలతో ఉత్తరతెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో భారీ మార్పులే చోటుచేసుకున్నాయి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire