Arrangements For Re-Open Schools in AP: రేపట్నుంచి అడ్మిషన్లు.. బడులు తెరిచేందుకు ముందస్తు ఏర్పాట్లు

Arrangements For Re-Open Schools in AP: ఐదు నెలలుగా ఇంటి పట్టున ఉన్న బడులవైపు తీసుకెళ్లేలా ఏపీ ప్రభుత్వం సంకల్పించింది.

Bathula Yesu Babu
Published on: 26 July 2020 7:45 AM IST
Arrangements For Re-Open Schools in AP: రేపట్నుంచి అడ్మిషన్లు.. బడులు తెరిచేందుకు ముందస్తు ఏర్పాట్లు
X
Schools Reopen in AP

Arrangements For Re-Open Schools in AP: ఐదు నెలలుగా ఇంటి పట్టున ఉన్న బడులవైపు తీసుకెళ్లేలా ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. ముందు జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటూనే విద్యార్థులను బడివైపు మళ్లించేలా సన్నద్ధం చేస్తోంది. సోమవారం నుంచి అడ్మిషన్లు ప్రారంభించి, ఆన్లైన్ తరగతులు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది.

'బడి గంటలు' మోగించేందుకు సర్కారు సిద్ధమవుతోంది. 2020-21 విద్యా సంవత్సరం క్యాలెండర్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం... పాఠశాలల్లో సోమవారం నుంచి అడ్మిషన్లు మొదలవుతాయి. సెప్టెంబరు 5 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో... సెప్టెంబరు 4 వరకూ అడ్మిషన్లు చేసుకునేందుకు అనుమతించారు. అయితే విద్యార్థులను పాఠశాలలకు రాకుండా చూడాలి. వారి తల్లిదండ్రులను మాత్రమే రప్పించాలి. ప్రతి ఉపాధ్యాయుడు వారానికి ఒకసారి పాఠశాలకు రావాలి. వారు బయోమెట్రిక్‌ హాజరు నమోదు చేయాల్సిన అవసరం లేదు. శనివారం 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్‌ను విడుదల చేసిన పాఠశాల విద్యా కమిషనర్‌... దీని అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు.

ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్‌లో ముఖ్యాంశాలు..

ఉపాధ్యాయుడు తన తరగతి గదికి సంబంధించి విద్యార్థి వారీగా ప్రణాళికను రూపొందించుకోవాలి. పాఠ్యాంశాలకు ఆన్‌లైన్‌ బోధన చేపట్టవచ్చు. కానీ ఆ బోధన ప్రత్యామ్నాయ అకడమిక్‌ క్యాలెండర్‌లో సూచించిన పాఠ్యప్రణాళికకు మాత్రమే పరిమితమై ఉండాలి. విద్యార్థులను మూడు విధాలుగా విభజించుకోవాలి. ఆన్‌లైన్‌ సౌకర్యాలు అందుబాటులో ఉన్న వారు(హైటెక్‌), రేడియో లేదా దూరదర్శన్‌ అందుబాటులో ఉన్న వారు(లోటెక్‌), కంప్యూటర్‌ గానీ మొబైల్‌ గానీ, రేడియో గానీ అందుబాటులో లేని వారు(నోటెక్‌). గ్రామ, పట్టణాల్లో ఎటువంటి సమాచార, ప్రసార, కంప్యూటర్‌ సాధనాలు అందుబాటులో లేని వారిపైన దృష్టి పెట్టే విధంగా టీచర్‌ ప్రణాళికను తయారు చేసుకోవాలి.

1 నుంచి 5వ తరగతి వరకూ కనీస అభ్యసన సామర్థ్యాలు సాధించే విధంగా 12 వారాల ప్రత్యామ్నాయ క్యాలెండర్‌లో చూపిన విధంగా కృత్యాలు చేయించాలి. 6 నుంచి 8వ తరగతి వరకూ కనీస అభ్యసన సామర్థ్యాలు సాధించే విధంగా 4 వారాల ప్రత్యామ్నాయ క్యాలెండర్‌లో చూపిన విధంగా ప్రాజెక్టు పనులు పిల్లల ద్వారా చేయించాలి. 9, 10 తరగతులకు విషయాల వారీగా బోధన చేపట్టవచ్చు. ఆన్‌లైన్‌, రేడియోల ద్వారా శిక్షణ చేపట్టవచ్చు.

స్థానికంగా విద్యావంతులైన యువత స్వచ్ఛందంగా ముందుకు వస్తే వారి సేవలు వినియోగించుకోవచ్చు. ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలల్లో కూడా వారానికి ఒకసారి హాజరు కావాలి. కానీ అందరూ ఒక్క రోజే హాజరుకావాల్సిన అవసరం లేదు. వారు ఏ రోజు హాజరు కావాలన్న విషయమై హెచ్‌ఎం ఉత్తర్వులివ్వాలి. ఇవి నాడు-నేడు పాఠశాలలకు కూడా వర్తిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్న వారు, కంటైన్‌మెంట్‌ జోన్‌లలో నివసిస్తున్నవారు, శారీరక వైకల్యం కలిగినవారు, కంటైన్‌మెంట్‌ జోన్‌లలో పాఠశాలలు ఉన్న ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరుకావాల్సిన అవసరం లేదు. కానీ తరగతి వారీగా, విద్యార్థి వారీగా ప్రణాళికలు రూపొందించుకోవాలి.

విద్యార్థుల తల్లిదండ్రులతో ఫోన్‌లో ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతూ ప్రణాళికఅమలు చేయాలి. ప్రత్యామ్నాయ అకడమిక్‌ క్యాలెండర్‌లో సూచించిన విధంగా ప్రతి టీచర్‌ రోజూ కనీసం 15 మంది తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి వారి పిల్లలు చేపట్టవలసిన విద్యా కార్యక్రమాల గురించి వివరించాలి. మరుసటి రోజు నుంచి ఐదుగురు చొప్పున తల్లిదండ్రులకు మళ్లీ ఫోన్‌ చేసి వారి పిల్లల పురోగతి తెలుసుకోవాలి. ఆ విధంగా వారానికి కనీసం 40 మంది విద్యార్థుల పురోగతి కనుక్కోవాలి.

టీచర్లు రోజు వారీ పనిని డైరీలో నమోదు చేసుకుని ప్రతి శనివారం ఫొటో రూపంలో గూగుల్‌ ఫారంలో అప్‌లోడ్‌ చేయాలి. ఆ వివరాలను సంబంధిత ఎమ్మార్వో, డిప్యూటీ ఈవో ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి.

Bathula Yesu Babu

Bathula Yesu Babu

Next Story