తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో వచ్చే ఏడాది 'బయో ఆసియా-2020' 17వ అంతర్జాతీయ సదస్సులను నిర్వహించనున్నామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సదస్సను ఫిబ్రవరి 17-20 మధ్య నిర్వహిస్తామని తెలిపారు. బయో ఆసియా-2020 సదస్సు నిర్వహణలో భాగస్వామ్యానికి లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగంలో వ్యాపార విధానాలు, సాంకేతిక పరిజ్ఞానంపై పరస్పరం దేశాలు సహకారం అందించుకోవడానికి కావలసినటువంటి ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయని తెలిపారు. ఈ ఒప్పంద కార్యక్రమం కేటీఆర్ సమక్షంలో నిర్వహించారు.
స్విట్జర్లాండ్ డిప్యూటీ కాన్సుల్ జనరల్ సిల్వనా రెంగ్లీ ఫ్రే, తెలంగాణ అధికారుల మధ్య సంతకాలు చేశారని కేటీఆర్ తెలిపారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ది చెందుతుందని ఆయన తెలిపారు. ఈ లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రధాన కేంద్రంగా తెలంగాణకు ప్రపంచ స్థాయి గుర్తింపు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది జరగబోయే ఈ సదస్సులో 50 దేశాలకు చెందిన 2 వేల మంది జీవశాస్త్ర నిపుణులు, ఫార్మా సంస్థల ప్రతినిధులు పాల్గొంటారని ఆయన తెలిపారు. అనంతరం పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్ మాట్లాడుతూ ఈ సదస్సును 'టుడే ఫర్ టుమారో' నినాదంతో నిర్వహిస్తామని తెలిపారు.