ఖైదీల్లో పరివర్తన తీసుకొచ్చేందుకు తెలంగాణ జైళ్ల శాఖ కొత్త కొత్త ఆలోచనలు చేస్తోంది. ఖైదీల్లో మార్పు తీసుకురావడంతో పాటు వారికి ఉపాధి కల్పిస్తోంది. అంతేకాదు వారికి ఆహ్లాదాన్ని అందించేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టింది జైళ్ల శాఖ.
సంగారెడ్డి జిల్లా జైలులో ప్రారంభించిన జైలు ఎఫ్ఎమ్ రేడియో ఖైదీల్లో మానసిక ప్రశాంతను నింపుతోంది. ఖైదీల్లో మార్పు కోసం ప్రారంభించిన ఈ ఎఫ్ఎంలో పాటలతో పాటు ఖైదీలకు ఉపయోగపడే ఎన్నో విషయాలను ప్రసారం చేస్తున్నారు. వినోదంతో పాటు ఖైదీలకు న్యాయ సహాయం, ములాఖత్, పెరోల్, బెయిలుకు సంబంధించిన సమాచారాన్ని ఎఫ్ఎం ద్వారా అందిస్తున్నారు.
ఇక జైళ శాఖ ఆధ్వర్యంలో వంద రకాలకు పైగా ఉత్పత్తులను మై నేషన్ బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్నారు. ఖైదీలు స్వయంగా తయారు చేసిన ఈ ఉత్పత్తుల్లో ఎలాంటి రసాయనాలు ఉండవని అంటున్నారు. వీటిని సంగారెడ్డి పరిసరాల్లోని షాపుల్లో అందుబాటులో ఉంచారు. అలాగే బీరువాలు, మంచాలు, ఫ్యానులు కూడా జైలల్లో తయారు చేయిస్తున్నారు. ఖైదీల్లో మార్పు తీసుకురావడంతో పాటు వారికి వినోదం, ఉపాధి కల్పిస్తోంది తెలంగాణ జైళ్ల శాఖ.