కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. మెజార్టీ ప్రజలు లాక్ డౌన్ పాటిస్తున్నప్పటికీ.. కొందరు మాత్రం మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలు ఏ మాత్రం లెక్కచేయడం లేదు. ఇక కొందరైతే అడ్డుకున్న పోలీసులపై దాడులకు కూడా తెగబడుతున్నారు. ఇలాంటి ఘటనే శుక్రవారం మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది.
ఒకే ద్విచక్ర వాహనంపై యువకుడితో పాటు తల్లిదండ్రులు ప్రయాణిస్తున్నారు. గమనించిన ఓ కానిస్టేబుల్ వారిని ఆపి లాక్డౌన్ అమల్లో ఉందని ద్విచక్ర వాహనంపై ఒకరి కంటే ఎక్కువ మంది ప్రయాణించకూడదని వారించారు. దీంతో ఆ యువకుడితో పాటు అతడి తల్లి తీవ్ర ఆగ్రహానికి గురై కానిస్టేబుల్ చొక్కా పట్టుకుని దాడి చేశారు. దీంతో ద్విచక్రవాహనం నడుపుకుంటూ వచ్చిన యువకుడిని పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లారు.