రెండోసారి అధికారంలోకి వచ్చాక.. మంగళవారం కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. సాయంత్రం మంత్రులకు శాఖల కేటాయింపు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ కేటాయింపులో తన మార్కును చూపించారు. కీలకమైన ఆర్థిక, రెవెన్యూ, విద్యుత్, నీటిపారుదల శాఖలను తనవద్దే ఉంచుకున్నారు. ఇక పాత మంత్రుల్లో ఇంద్రకరణ్ రెడ్డి ,తలసాని శ్రీనివాస్ యాదవ్ లకు ఇంతకుముందున్న శాఖలనే కేటాయించారు. గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖను నిర్వహించిన ఈటల రాజేందర్కు వైద్య, ఆరోగ్య శాఖను, జి.జగదీశ్రెడ్డి మొదట చేపట్టిన విద్యాశాఖను అప్పగించారు. గత ప్రభుత్వంలో జూపల్లి కృష్ణారావు నిర్వహించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను అదే సామాజిక వర్గానికి చెందిన ఎర్రబెల్లి దయాకర్రావుకు కేటాయించారు.
అలాగే గతంలో టి.పద్మారావుగౌడ్ నిర్వహించిన ఎక్సైజ్, యువజన సర్వీసుల శాఖలను.. అదే సామాజిక వర్గానికి చెందిన వి.శ్రీనివాస్గౌడ్కు, పట్నం మహేందర్రెడ్డి నిర్వహించిన రవాణా శాఖను అదే సామాజిక వర్గానికి చెందిన వేముల ప్రశాంత్రెడ్డికి, గత ప్రభుత్వంలో పోచారం శ్రీనివాస్రెడ్డి నిర్వహించిన వ్యవసాయ శాఖను అదే సామాజిక వర్గానికి చెందిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కేటాయించారు. అలాగే అసెంబ్లీలో కీలకమైన శాసనసభ వ్యవహారాల శాఖను కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన వేముల ప్రశాంత్రెడ్డికే కేసీఆర్ కేటాయించారు.