కరోనా వ్యాప్తిని నిరోధించడానికి విశేషంగా కృషి చేస్తున్న వైద్య ఆరోగ్య, పోలీసు శాఖల సిబ్బందికి మార్చి నెలకు పూర్తి వేతనం చెల్లించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ రెండు శాఖల ఉద్యోగులకు అదనపు నగదు ప్రోత్సాహకాలు (ఇన్సెంటీవ్స్) కూడా అందించాలని నిర్ణయించారు. అయితే ఈ ఇన్సెంటీవ్స్ ఎంత శాతం ఇవ్వాలనేది ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. ప్రగతిభవన్లో బుధవారం నిర్వహించిన సమీక్షలో సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.