సచివాలయానికి రాని మిమ్మల్ని ఎన్ని సార్లు డిస్మిస్ చేయాలి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
సిద్ధిపేట జిల్లాలో బీజేపీ కార్యాలయ భవన నిర్మాణానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతిస్తూ మాట్లాడారు. అనంతరం సీఎం కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు. ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలంటూ వారి డిమాండ్లను నెరవేర్చాలని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించారని ఆయన తెలిపారు.
ఉద్యమకాలంలో సకలజనుల సమ్మె కార్యక్రమంలో భాగంగా వారు బస్సులను తిరగకుండా చేశారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా చాలా మంది కార్మికులు తమ ప్రాణాలను కూడా కోల్పోయారని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు. అవి ఆత్మహత్యలు కాదని ఖచ్చితంగా అవి ప్రభుత్వ హత్యలే అని ఆయన మండిపడ్డారు. ఉద్యమ కాలంలో సీఎం ఇచ్చిన హామీలనే పరిష్కరించాలని కార్మికులు అడుగుతున్నారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకూ మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు ఆగలేదు కానీ ఎంతో కష్టపడుతున్న ఆర్టీసీ కార్మికుల జీతాలు మాత్రం ఎందుకు ఆపుతున్నారని ఆయన ప్రశ్నించారు.
39 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను డ్యూటీలో చేరకపోతే డిస్మిస్ చేస్తానంటున్నావ్.. సచివాలయానికి రాని మిమ్మల్ని ఎన్ని సార్లు డిస్మిస్ చేయాలి అని లక్ష్మణ్ మండిపడ్డారు. అంతే కాక 'ఆర్టీసీ తో మంట పెట్టించుకున్నావ్ జాగ్రత్త.. ఆ మంటల్లో కాలి పోయే రోజు వస్తుందని' ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. కేసీఆర్ చేస్తున్న నియంత పాలనకు బీజేపీ పార్టీయే తగిన గుణపాఠం చెప్తుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఆర్టీసీ ఉద్యమం మంత్రుల కోసమో చైర్మన్ల కోసమో అమ్ముడు పోదని ఆయన స్పష్టం చేశారు.