చలో ట్యాంక్బండ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన బీజేపీ ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను అక్కడ నుంచి తరలించారు. అరెస్ట్ల ద్వారా ఉద్యమాలను అణచలేరన్నారు ఎంపీ బండి సంజయ్. మిలియన్ మార్చ్తోనే కేసీఆర్ పతనం ప్రారంభంఅయిందని, ప్రగతి భవన్ గడీలను బద్దలు కొడతాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన 'చలో ట్యాంక్బండ్' ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు అనుమతించనప్పటికీ ఆర్టీసీ కార్మికులు భారీ సంఖ్యలో ట్యాంక్ బండ్ చేరుకున్నారు. పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్మికులు బారికేడ్లు, కంచెలపై నుంచి దూకి వచ్చారు. కార్మికులను అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించ లేదు. లాఠీ ఛార్జ్ చేశారు. ఆందోళన కారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ప్రతిగా పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. పలువురు కార్మికులు గాయపడ్డారు. లిబర్టీ, దోమలగూడ వైపు ఆందోళన కారులను పోలీసులు తరుముతున్నారు.