టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిని బయటపెడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం డీపీఆర్ లేకుండానే టెండర్లకు ఎందుకు వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. 2 శాతం కమిషన్ తీసుకోమ్మని కేటీఆర్ చెప్పడం నిజం కాదా అని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ సోమవారం విలేకరులతో మాట్లాడారు. బీజేపీ సభ విజయవంతం కావడంతో టీఆర్ఎస్ పీఠాలు కదులుతున్నాయని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. జేపీ నడ్డా ఎవరో తెలియదనడం కేటీఆర్ అహంకారాన్ని తెలుపుతోందని, కేటీఆర్ లాగా నడ్డా ప్యారాచుట్ పట్టుకొని రాజకీయాల్లోకి రాలేదని విమర్శించారు. కేటీఆర్లాగా తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి నడ్డా కాదని, కేటీఆర్ పుట్టకముందు నుంచే నడ్డా రాజకీయాల్లో ఉన్నారని గుర్తు చేశారు. నడ్డా కల్వకుంట్ల కుటుంబ బిడ్డ కాదు, భారతమాత ముద్దుబిడ్డ అనీ తండ్రి అధ్యక్షుడుగా ఉన్న పార్టీకి కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న చరిత్ర టీఆర్ఎస్ ది అని విమర్శించారు లక్ష్మణ్. సభలో నడ్డా వేసిన ప్రశ్నలు నిజామో కాదో టీఆర్ఎస్ చెప్పాలని, టీఆర్ఎస్ కాంట్రాక్టర్లకు జేబులు నింపే పని పెట్టుకుందని మండిపడ్డారు. రైతు బంధు, ఆరోగ్య శ్రీ ఎందుకు ఆగిపోయిందో సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు.