వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి ప్రాంతం ప్రకృతి అందాలతో మనోహరంగా ఉంటుంది. అలాంటి అనంతగిరి కొండలను తెలంగాణ ఊటీగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనంతగిరి కొండలను టూరిజం స్పాట్గా అభివృద్ధి చేయాలనే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడారు. విషయం చెప్పగానే ముఖ్యమంత్రి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాడానికి ఒప్పుకున్నారని, అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఆదేశాలు కూడా జారీ చేశారని ఆయన తెలిపారు.
ఆయన మాట్లాడిన వెంటనే మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అడిగిన వెంటనే ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు, ఎంపీ రంజిత్రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్, జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డితో కలిసి అనంతగిరి కొండల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు తెలుసుకుంటున్నామని తెలిపారు.
తెలంగాణలో ఉన్న అనంతగిరిని టూరిజం స్పాట్ గా మారుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. అధికారులంతా సమైక్యంగా పనులను చేసి 10 రోజుల్లో దీనికి సంబంధించిన ప్రతిపాదనలను తయారు చేసి అందించాలని సూచించారు. మంత్రులు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి అభివృద్ధి కోసం ప్రణాళికలు, నివేదికలు సమర్పించాలని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోనే అనంతగిరిని ఉత్తమ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్బంగా వారు తెలిపారు. ఈ విషయాలను గురించి అధ్యయనం చేయడానికి కమిటీని ఏర్పాటు చేస్తున్నామని వారు తెలిపారు. 10 నుంచి 15 రోజుల్లో అన్ని వివరాలను తెలియజేస్తామని వారు తెలిపారు.